రాహుల్ గాంధీకి మతి తప్పిందన్న బీజేపీ.. ముదురుతున్న రాఫెల్
ఢిల్లీ : రాఫెల్ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య దుమారం రేపుతోంది. నువ్వెంతంటే నువ్వెంతా అనే రేంజిలో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు ఆ పార్టీల నేతలు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ప్రధాని మోడీ అనిల్ అంబానీకి 30 కోట్ల రూపాయలు దోచిపెట్టారని వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. రఫేల్ వివాదంపై కేంద్రం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్గా రఫేల్ విషయంలో ఆయన చేస్తున్న ఆరోపణలను ఖండించింది. అంతేకాదు రాహుల్ మతి స్థిమితం కోల్పోయారని వ్యాఖ్యానించింది. అబద్ధాలను నిజమని నమ్మించేలా ఆయన ప్రచారం చేస్తే అవి ప్రజలు నమ్మేస్తారా అంటూ ప్రశ్నించింది. రఫేల్ వివాదంపై కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ పూర్తి వివరణ ఇచ్చినప్పటికీ.. రాహుల్ గాంధీ మాత్రం కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఫైరయింది. అబద్ధపు ప్రచారాలతో మోడీని ఇరుకున పెట్టాలనుకుంటున్న రాహుల్ ఆటలు సాగవని హెచ్చరించింది.