బిజెపికి ప్రపంచంలోనే అందమైన ముఖముంది: కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అందమైన ముఖం బిజెపికి ఉందని.. అది ప్రధాని మోడీదేనని అభివర్ణించారు.
ఢిల్లీలో పోటీ చేయడానికి బిజెపికి సరైన ముఖం లేకపోవడంతోనే కిరణ్ బేడీని నరేంద్ర మోడీని తెరపైకి తీసుకొచ్చారన్న ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ‘బిజెపికి ప్రపంచంలోనే అందమైన ముఖం ఉంది. అది నరేంద్ర మోడీ. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకే పార్టీలో చేరా. ఆయన నాయకత్వంలో పనిచేసే మేము కేవలం ఆయన చుట్టూ తిరిగే స్టార్స్ మాత్రమే' అని కిరణ్ బేడీ అన్నారు.
మూడు రోజుల క్రితం బిజెపిలో చేరిన ఆమె.. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఎన్నికలపై చర్చలు జరిపారు. ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని ఆమె వివరించారు.
కాగా, ఢిల్లీ ఎన్నికల్లో కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా బిజెపిలో చేరిన కిరణ్ బేడీపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెపై ఆరోపణలు చేయడం ప్రారంభించింది. అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఇద్దరూ అవకాశ వాదులని కాంగ్రెస్ నేత అజయ్ మాకేన్ ఆరోపించారు.