జయ ఎఫెక్ట్: రజనీకాంత్ తర్వాత విజయ్ వైపు బీజేపీ!
చెన్నై: తమిళనాడులో పట్టు కోసం భారతీయ జనతా పార్టీ సూపర్ స్టార్ రజనీకాంత్ను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్తో పాటు హీరో విజయ్ పైన కూడా కమలం పార్టీ దృష్టి సారించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హవా పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. ఇదే ఊపును మిగతా రాష్ట్రాల్లోను కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకు పక్కా ప్రణాళికలతో వెళ్లాలని చూస్తోందని చెబుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్... ఇలా అన్ని రాష్ట్రాల పైన బీజేపీ దృష్టి సారిస్తోంది.
తమిళనాడు విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు విజయకాంత్ ఇప్పటికే పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఉన్నారు. అతను సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో జతకట్టారు. ఇక ముందు కూడా అతనితో కలిసి పని చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. అలాగే, తమిళనాట మంచి క్రేజ్ ఉన్న నటుడు విజయ్ను కూడా తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆమె మెడకు అక్రమాస్తుల ఉచ్చు బిగుసుకుంది. రాష్ట్రంలో డీఎంకే పార్టీ ప్రభావం రోజు రోజుకు మసకబారుతోందని అంటున్నారు. దీనికి తోడు ఆ పార్టీ సంక్షోభంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేను డీఎంకే ఢీకొట్టే స్థాయిలో లేదని అంటున్నారు.
ఇక, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. రజనీకాంత్ను ముగ్గులోకి లాగాని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరో విజయ్ పైన దృష్టి సారించాయంటున్నారు.
గత ఎన్నికల్లో విజయ్ అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలికారు. అయితే, ఇటీవల ఆయన సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. అనంతరం సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయ్, నరేంద్ర మోడీ కలుసుకున్నారు. విజయ్, మోడీలు కలుసుకోవడం చర్చనీయాంశమైంది.
తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని భావిస్తున్నారు. రజనీకాంత్, విజయ్, విజయకాంత్ల ద్వారా చొచ్చుకు పోవాలని బీజేపీ భావిస్తోందంటున్నారు. విజయ్ వంటి వారు పార్టీలోకి రాకపోయినప్పటికీ.. ఆయన మద్దతు, అలాగే విజయకాంత్తో అదే సాన్నిహిత్యం కొనసాగించి.. తమిళనాట నిలబడాలని చూస్తోందని అంటున్నారు.