బిజెపికి బాబు గిఫ్ట్: ఎపి నుండి రాజ్యసభకు సీతారామన్
హైదరాబాద్: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల లాటరీలో ఆంధ్రప్రదేశ్కు 11 మంది, తెలంగాణకు 7గురు రాజ్యసభలు వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన దాంట్లో ఎన్ జనార్ధన్ రెడ్డి (ఎన్జెఆర్) కూడా ఉన్నారు. ఎన్జెఆర్ ఇటీవల మృతి చెందారు. ఆయన స్థానంలో నిర్మలా సీతారామన్ను ఎపి రాజ్యసభకు పంపించనుంది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎన్జెఆర్ స్థానం ఆ పార్టీకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో టిడిపికి వచ్చే రాజ్యసభ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని బిజెపి కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరినట్లుగా సమాచారం. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారట.

తెలుగు కోడలు అయిన నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉన్నారు. అయితే ఆమెకు ప్రస్తుతం ఏ సభలోను ప్రాతినిథ్యం లేదు. దీంతో టిడిపి తమకు కేటాయించే స్థానం నుండి నిర్మలను రాజ్యసభకు పంపించాలని బిజెపి యోచిస్తోంది.
ఇదే విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. మనకు వచ్చే రాజ్యసభ స్థానాన్ని తమకు ఇవ్వాలని బిజెపి అడిగిందని, వారికి ఇద్దామని ఎంపీలకు ఆయన మంగళవారం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్తామని వారికి సూచించారు. నిర్మలా సీతారామన్ను ఎపి నుండి పంపిస్తే.. రాష్ట్రం నుండి మరో కేంద్రమంత్రి ప్లస్ అవుతారు. ఇది రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని బాబు భావిస్తున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ను మధ్యప్రదేశ్ నుండి పంపించే అవకాశాన్ని బిజెపి పరిశీలిస్తోందని సమాచారం. అయితే దాదాపు ఇప్పటికే ఎపి నుండి నిర్మలా సీతారామన్ ఎంపికను బిజెపి పూర్తి చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పదవులకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. అవసరమైతే ఆయనను కర్నాటక నుండి పంపించే అవకాశాలున్నాయి. పురంధేశ్వరికి మరోసారి అవకాశమిస్తామని బుజ్జగించే అవకాశముందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications