కర్ణాటకలో చంద్రబాబు సమవుజ్జీ- బీజేపీ సీన్ మారుస్తారా?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం- 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇందులో పలు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. అధికార భారతీయ జనతా పార్టీ 65 నియోజకవర్గాలకే పరిమితమైంది. పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.
కర్ణాటకలో విజయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా శ్రమించింది. ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. పార్టీ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేయగలిగారు. హైకమాండ్ మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త వరకు క్యాడర్ను సమన్వయం చేసుకోగలిగారు.

ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి ఘన విజయం సాధించారు. బెళగావి జిల్లాలోని గోకక్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కూడా గెలవడంతో ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టినట్టయింది. 1999 నుంచి గోకక్ నియోజకవర్గానికి జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆయన పోటీ చేస్తూ వచ్చారు. ఏ ఎన్నికలో కూడా ఓటమి చవి చూడలేదు.
అయిదుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన తరువాత బీఎస్ యడ్యూరప్ప చేపట్టిన ఆపరేషన్ కమలకు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ సీట్లను కోల్పోవడానికి కారణమైన ఎమ్మెల్యేల్లో రమేష్ జార్కిహోళి కూడా ఒకరు. తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, మళ్లీ గెలిచారు. ఇప్పుడు తాజాగా అదే స్థానం నుంచి, అదే పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.
గతంలో రమేష్ జార్కిహోళిపై సెక్స్ స్కాండల్ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాన్ని ఎరచూపి ఓ మహిళను లొంగదీసుకున్న విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ మహిళతో హోటల్ గదిలో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు అప్పట్లో సంచలనం రేపాయి. దీని తరువాత ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications