కాల్చి చంపారు?: రైలు పట్టాలపై బిజెపి నేత మృతదేహం
హుగ్లీ: రైలు పట్టాలపై స్థానిక భారతీయ జనతా పార్టీ నేత మృతదేహం లభ్యమైంది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఆయన హత్య జరిగిందని బిజెపికి చెందిన పలువురు నాయకులు ఆరోపించారు.
కనాయిపూర్ గ్రామ పంచాయతీ బిజెపి సభ్యుడు నందగోపాల్ ఠాకూర్(53) మృతదేహం షేరాఫులి-దాయిరాహ్ రైల్వే స్టేషన్ల మధ్య లభించిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఘటనపై స్పందించిన జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు స్వపన్ పాల్ మాట్లాడుతూ.. హింద్ మోటార్ మున్సిపల్ ప్రాంతంలో ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి)కి వ్యతిరేకంగా ఠాకూర్ ప్రచారం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలోనే టిఎంసి ఈ హత్యకు పాల్పడిందని ఆరోపించారు.
‘గత రాత్రి అతని ఇంటికి సమీపంలో జరుగుతున్న ‘శ్రధ్' కార్యక్రమానికి వెళుతున్న ఠాకూర్ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. అతని మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది. అతని హత్యకు టిఎంసికి సంబంధముంది' అని పాల్ తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఠాకూర్ మృతికి టిఎంసి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, బిజెపి నేతలు నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని టిఎంసి జిల్లా అధ్యక్షుడు తపన్ దాస్ గుప్తా అన్నారు. వారు ఎన్నికల్లో గెలవలేరని వారికి తెలుసని బిజెపి నేతలనుద్దేశించి అన్నారు.