నిన్నటిదాకా బీఫ్.. ఇప్పుడు పోహ.. దేశ ద్రోహం.. : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ పట్టిక(NPR),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లపై దేశవ్యాప్తంగా నిరసనలు,ఎడ తెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన చట్టం అంటూ ప్రతిపక్షాలు,ప్రజా సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు తీసుకొచ్చిన బిల్లు అని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేత కైలాష్ విజయ్వర్గియా ఆహారపు అలవాట్లకు, అక్రమ వలసదారులకు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పౌరసత్వ సవరణకు మద్దతుగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
విజయ్వర్గియా వివాదాస్పద వ్యాఖ్యలు :
ఇటీవల తన ఇంట్లో అదనంగా మరో గదిని నిర్మించామని చెప్పిన విజయ్వర్గియా.. దాని నిర్మాణం కోసం వచ్చిన కార్మికులపై తనకు అనుమానం కలిగిందన్నారు. అందుకు కారణం.. ఆ కార్మికులు పోహ(అటుకుల ఉప్మా) తినడమేనని చెప్పారు. వాళ్లు పోహ తింటుండటం చూసి.. బంగ్లాదేశీయులుగా అనుమానించినట్టు చెప్పారు. తన తీరును పసిగట్టారో.. ఏమో.. రెండు రోజుల తర్వాత వారు పనిలోకి రావడం మానేసినట్టు తెలిపారు. ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని.. ప్రజలను అప్రమత్తం చేయడానికే దీని గురించి చెబుతున్నానని తెలిపారు.
ఆహారపు అలవాట్లను జాతీయతతో ముడిపెట్టడమా..?
ఆహారపు అలవాట్లను జాతీయతతో ముడిపెట్టి మాట్లాడటంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇక ఇప్పటి నుంచి పోహ తినడమంటే దేశ ద్రోహానికి పాల్పడ్డట్టే అంటూ ట్విట్టర్లో సెటైర్స్ వేస్తున్నారు. ఇక మరో నెటిజెన్.. 'ఈమధ్య నేను కొత్తగా రెండు విషయాలు నేర్చుకున్నాను.. ఒకటి హల్వా తినడం శుభప్రదమం, రెండు పోహ తినడం అనుమానాస్పదం' అంటూ ట్రోల్ చేశాడు. ఇక మరో నెటిజెన్.. 'పోహ కొత్తగా బీఫ్గా మారిపోయింది' అంటూ కామెంట్ చేశాడు.
పోహ కొత్తగా బీఫ్గా మారిపోయిందా..?
విజయ్వర్గియా కామెంట్లపై ట్విట్టర్లో లెక్కలేనన్ని సెటైర్స్ పడుతున్నాయి. మొదట వాళ్లు బీఫ్ తినేవాళ్లను దేశ ద్రోహులు అన్నారని, ఇప్పుడు పోహ తినేవాళ్లను కూడా దేశ ద్రోహులు అంటున్నారని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. బహుశా ఆ నేతకు తెలియదేమో.. దేశంలోని పేదలు ఎక్కువగా తినేవాటిల్లో పోహ కూడా ఒకటి. తక్కువ వేతనాలతో పనిచేసే ఆ కార్మికులు.. తమ జీతంలో 80శాతాన్ని ఇంటికే పంపిస్తారు. అందుకే పోహ లాంటి తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకునే ఫుడ్స్ను వారు ఎక్కువగా తింటారని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు.
ఇండోర్ మొత్తం బంగ్లాదేశీయులేనా..?
విజయ్వర్గియా ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1993-2003లో ఇండోర్ మేయర్ గానూ ఆయన పనిచేశారు. ఇండోర్లో పోహ-జిలేబీ కాంబినేషన్ చాలా పాపులర్. అలాంటి నగరంలో ఉంటూ విజయ్వర్గియా పోహ తినేవాళ్లపై అనుమానం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. పోహ తినేవాళ్లు బంగ్లాదేశీయులైతే.. ఇండోర్ మొత్తం బంగ్లాదేశీయులే అని అక్కడి స్థానికులు ట్విట్టర్లో కామెంట్ చేస్తున్నారు. సీఏఏ ఆందోళనల్లో పాల్గొంటున్నవారిని.. వారి దుస్తుల ఆధారంగా గుర్తుపట్టవచ్చునని ఇటీవల ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు విజయ్వర్గియా ఆహారపు అలవాట్లను అనుమానించడం వివాదాస్పదంగా మారింది.












Click it and Unblock the Notifications