బీజేపీ ఉదార స్వభావం వల్లే మూకదాడులు..! కమలంపై మరోసారి మండిపడ్డ మాయావతి..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి ప్రభుత్వ విధానాలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అమాయుకులపై మూకదాడులు పెరిగిపోయాయని ఘాటుగా విమర్శించారు. అభివృద్ది చెందుతున్న సమాజంలో ఇలాంటి దాడులు ఎంతవరకూ శ్రేయస్కరమని ఆమే ప్రశ్నిస్తున్నారు. మూకదాడులపై కఠిన చట్టం తీసుకురావడంలో బీజేపీ నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తోందని మాయావతి విమర్శించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టం తీసుకురావాలని మాయావతి డిమాండ్ చేశారు. మూకదాడులను అదుపు చేసేందుకు ఉత్తరప్రదేశ్ లా కమిషన్ తీసుకుంటున్న చొరవను ఓ ట్వీట్లో ప్రశంసించారు. 'లోక్పాల్ తరహాలోనే మూకదాడులపై కఠినంగా వ్యవహరించే విషయంలో బీజేపీ ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ లా కమిషన్ తీసుకుంటున్న చొరవను నేను స్వాగతిస్తున్నాను' అని మాయావతి ట్వీట్ లో పేర్కొన్నారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్లో అంతకంతకూ పెరుగుతున్న మూకదాడుల ఘటనపై యూపీ లా కమిషన్ ఒక నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు అందజేసింది. మూకదాడులకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగారం, భారీ జరిమానా విధించాలని లా కమిషన్ సిఫారసు చేసింది. కాగా, బీజేపీ ఆలోచనా విధానం వల్లే దేశంలో మూకదాడులు పెరుగతున్నాయని మాయావతి ఆరోపించారు. దేశంలో మూకదాడులు అనేవి తీవ్రమైన వ్యాధిగా మారిందని, బీజేపీ కఠిన చట్టం తీసుకురాకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.
ఇందువల్ల దళితులే కాకుండా, గిరిజనులు, మతపరమైన మైనారిటీలు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు, పోలీసులు సైతం బాధితులుగా మారుతున్నారని ఆమె ఆరోపించారు. మూక దాడుల ముసుగులో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారదని, పగలు, ప్రతీకారాలు తీర్చుకునేందుకు మూకదాడులను సాకుగా చూపుతున్నారని మాయావతి ఆరోపించారు.