పని చేయని మంత్రులకు మోడీ షాక్: దేశాయ్, ముఫ్తీలకి ఛాన్స్?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించ వచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే ప్రధాని కేబినెట్లో మార్పులు, చేర్పులు చేయవచ్చునని అంటున్నారు. పని తీరు సరిగ్గా లేని మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని సమాచారం.
అదే సమయంలో ఆ స్థానంలో మిత్రపక్షాలైన పిడీపీ, శివసేనలకు చోటు కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారని తెలుస్తోంది. శివసేన నేత అనిల్ దేశాయ్, పీడీపీ నేత మహబూబా ముఫ్తీకి చోటు దక్కవచ్చునని ప్రచారం సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లోని మంత్రుల పనితీరు పైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఒకరిద్దరు మంత్రులపై అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. వారికి ఉద్వాసన పలికి, మిత్రపక్షాల వారిని తీసుకోవచ్చునంటున్నారు.
ఈ నెల 20వ తేదీన రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలోగానే పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, మంత్రి పదవుల్లో మార్పులు చేర్పులు కూడా చేయవచ్చునంటున్నారు. సమాచారం మేరకు ముక్తార్ అబ్బాస్ నక్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనోజ్ సింగ్లకు ప్రమోషన్ రావొచ్చునని చెబుతున్నారు.