సీఎం పదవికి సొంత పార్టీ ఎంపీలు ఎసరు, నా సత్తా తెలుసు, భయపడను, హైకమాండ్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించడానికి సొంత పార్టీ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ మీద ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ కు బీజేపీ హైకమాండ్ నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం బీజేపీ మీద విమర్శలు చెయ్యడం మాత్రం మానలేదు. ఇలాంటి సోకాజ్ నోటీసులకు తాను భయపడను అని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ బాంబు పేల్చారు. సీఎం మీద కుట్రలు చేస్తున్న ఇద్దరు ఎంపీల కారణంగా బీజేపీ పరువు పోతుందని, కర్ణాటకకు అందవలసిన నష్టపరిహారం రాకుండా ఆలస్యం అవుతోందని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ మండిపడ్డారు.

ప్రధాని, అమిత్ షా
కర్ణాటక వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ నష్టపరిహారం అందించలేనే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ మీద ఆరోపణలు చెయ్యడంతో బీజేపీ హైకమాండ్ బసవనగౌడ పాటిల్ యత్నాల్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తూ తాను ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ, నడ్డాకు లేఖలు రాశానని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ బుధవారం విజయపురలో మీడియాకు చెప్పారు.

ఇలాంటి ఎంపీలు అవసరమా ?
సీఎం బీఎస్. యడియూరప్పను అధికారం నుంచి కిందకు దించడానికి ఇద్దరు సొంత పార్టీ ఎంపీలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరు ఎంపీలు ఢిల్లీకి వెళ్లారని, అయితే వారు నష్ట పరిహారం ఇవ్వాలని చర్చించడానికి ఢిల్లీకి వెళ్లలేదని అన్నారు. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి కిందకు దించడానికి ఆ ఇద్దరు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారని, వారు ఢిల్లీ వెళ్లిన తరువాతే తనకు షోకాజ్ నోటీసులు వచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు.

సీఎం రాజీనామా చెయ్యాలని చెప్పండి
ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తీరుతో మీకు ఇబ్బందులు ఉంటే ఆయన్ను పిలిపించుకుని మీకు 75 ఏళ్లు దాటి పోయాయి, సీఎం పదవికి రాజీనామా చెయ్యండి అని చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. అంతే కాని ఇలాంటి కుట్రలు చెయ్యకూడదని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఎంపీలకు సూచించారు.

ప్రధానితో భేటీకి చాన్స్
తాను ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఢిల్లీలో ఉన్న ఆ ఇద్దరు ఎంపీలు అడ్డుపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడానిక అవకాశం వస్తోందని, సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన తనకు మాత్రం అవకాశం రావడం లేదని, ఇదేం న్యాయమని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ విచారం వ్యక్తం చేశారు.

నా సత్తా నాకు తెలుసు
తనను బీజేపీ నుంచి బహిష్కరిస్తే తనకేం నష్టం లేదని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. నా సత్తా ఏమిటో విధాన పరిషత్ లోనే చూపించానని, తనను బీజేపీలోకి ఈ నాయకులు ఎవ్వరూ ఆహ్వానించలేదని, నా పవర్ ఏమిటో తెలుసుకుని అమిత్ షా తనను బీజేపీలోకి చేర్చుకున్నారని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు.

ప్రజల కోసం
ప్రధాని ముందు సమస్యలు చెప్పడానికి ఎప్పుడూ తాను వెనకడుగు వెయ్యనని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. తాను ఆదాయపన్ను చెల్లించకుండా మోసం చెయ్యలేదని, భూకబ్జాలు చెయ్యలేదని, తాను ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతున్నానని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడాలని, ముసుగులో గుద్దులాట అంటూ డ్రామాలు వెయ్యకూడదని, అలాంటి విద్య తనకు తెలీదని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు.

వాజ్ పేయి గ్రేట్
సీఎం యడియూరప్ప, యత్నాల్ ను పక్కన పెడితే వీరశైవ లింగాయిత్ కు ద్రౌహం చేసినట్లు అవుతోందని ప్రజలకు సంకేతం ఇచ్చినట్లు అవుతోందని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని అప్పట్లో తాను అటల్ బిహారి వాజ్ పేయికి చెప్పానని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. వాజ్ పేయి తనను మందలించకుండా అభినందించి మంత్రి పదవి ఇచ్చారని, ఆయనా చాల గ్రేట్ అని బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఇదే సమయంలో చెప్పారు.












Click it and Unblock the Notifications