బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం, 121 తగ్గిన సంఖ్యా బలం
ముంబై: మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గోవింద్ ముఖ్కజీ రాథోడ్ సోమవారం ఉదయం మృతి చెందారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గోవింద్ రాథోడ్ నాందెడ్ జిల్లా ముఖేడ్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఈయన మృతితో మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ బలం 121కి తగ్గింది.
ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆయన రైలులో ముంబైకి వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. అతను ఆదివారం ఉదయం మృతి చెందారు. గోవింద్ రాథోడ్ నాందెడ్ జిల్లాలోని ముఖేద్లో నివసిస్తున్నారు.
మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ?

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో రాజకీయ అనిశ్చితికి ముగింపు పలకడంపై బీజేపీ అధినాయకత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ ఆదివారం ఇక్కడ చెప్పారు. ఢిల్లీలో తాజాగా ఎన్నికలు ఎదుర్కోవడానికి బీజేపీ భయపడి పారిపోతోందన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
ఎన్నికలకు తమ పార్టీ పూర్తి సంసిద్ధంగా ఉందని, ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రజలు తమ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నారన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, త్వరలోనే రాజకీయ పరిస్థితి స్పష్టమవుతుందన్నారు.
ఎన్నికల కమిషన్ ఢిల్లీలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ప్రకటించినంత మాత్రాన బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డం లేదని అర్థం కాదన్నారు. ఒకవేళ తాజాగా ఎన్నికలు జరిగితే తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్నారు.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం అన్నది రాజ్యాంగపరంగా నెరవేర్చాల్సిన బాధ్యత అని, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అభిప్రాయాలను అది ప్రతిబింబించదని, నిజానికి కాంగ్రెస్, ఏఏపీలే ఎన్నికలకు సిద్ధంగా లేవని ఆయన అన్నారు.
ప్రజల్లో తమ పార్టీకి మద్దతు చెక్కుచెదరలేదని మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేసాయని, ఢిల్లీలో కూడా ప్రజల మద్దతు తమకే ఉంటుందన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో అనిశ్చితి కొనసాగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications