డాక్టర్లను తరిమి తరిమి కొట్టిన బీజేపీ ఎంపీ (వీడియో)
తన తల్లికి సరైన వైద్యం చెయ్యలేదని ఆరోపిస్తూ ఉత్తర కన్నడ జిల్లా బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఇద్దరు డాక్టర్లను తరిమి తరిమి కొట్టారని ఆరోపణలు వచ్చాయి. అడ్డు వచ్చిన ఆసుపత్రి సిబ్బంది మీద దాడి చేశారు.
బెంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఆసుపత్రిలో విధులలో ఉన్న ఇద్దరు వైద్యులతో సహ ముగ్గురి మీద దాడి చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మీద కేసు నమోదు చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అనంతకుమార్ తల్లికి కాలు విరగడంతో ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసి పట్టణంలోని టీఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కాలు విరిగిందని చెప్పిన వైద్యులు మరో రోగికి శాస్త్ర చికిత్స చెయ్యడానికి వెళ్లారు.
సోమవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్న ఎంపీ అనంతకుమార్ హెగ్డే తన తల్లికే మీరు సరైన వైద్యం చెయ్యడం లేదని, మీరు సామాన్యులను ఏమి పట్టించుకుంటారని అని రెచ్చిపోయి వైద్యుల మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఎముకల డాక్టర్ మధుకేశ్వర చెవి, ముఖం మీద గాయాలైనాయని, డ్యూటీ డాక్టర్ బాలచంద్ర భట్, ఆసుపత్రి ఉద్యోగి రాహుల్ కు పలు చోట్ల గాయాలైనాయని ఆసుపత్రి సిబ్బంది ఆరోపించారు. అదే రోజు అర్దరాత్రి వైద్యులు అందరూ సమావేశం అయ్యి బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే మీద కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఆసుపత్రిలో ఎంపీ దాడి చేసే సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్ లు తీసుకుని వైద్యులు అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీఎస్ఎస్ ఆసుపత్రి చైర్మన్ శాంతారామ హెగ్డే వైద్యులను, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేని ఒక చోట కుర్చోపెట్టి రాజీ చేశారని తెలిసింది.