బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి షాకింగ్-బిపిన్ రావత్ దుర్మరణంపై అనుమానాలు
నిత్యం తనదైన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఇవాళ తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనపై స్పందించారు. ఈ ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పాలవ్వడంపై స్పందించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు ఈ ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బిపిన్ రావత్ ఆర్మీలో ఎంతో నిబద్ధత కలిగిన అధికారి అని, ప్రభుత్వాలకు భయపడే రకం కాదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి తెలిపారు. చైనాతో మనకు ముప్పు పొంచి ఉందని ఆయన పదే పదే చెప్పేవారని స్వామి గుర్తుచేశారు. తమిళనాడులో హెలికాఫ్టర్ ఎగరగానే మంటలు అంటుకుని ఉండొచ్చని స్వామి అన్నారు. సైబర్ వార్ ఫేర్ కారణంగా ఈ దుర్ఘటన జరిగి ఉండొచ్చని స్వామి అనుమానాలు వ్యక్తం చేశారు.
మనం చైనా ముప్పును చాలా లైట్ తీసుకుంటున్నామని ఎంపీ సుబ్రమణ్యస్వామి తెలిపారు. కానీ దీంతో మన దేశ సమగ్రత ప్రశ్నార్ధకమవుతోందన్నారు. ఈ ఘటన తర్వాత మన దేశ అంతర్గత, బహిర్గత ముప్పుపై పార్లెమంటుతో పాటు కేంద్రం కూడా సమీక్ష చేసుకోవాలని స్వామి సూచించారు. తద్వారా దేశంలో ప్రస్తుతం మనకు అంతర్గతంగా, బహిర్గతంగా కూడా ముప్పు పొంచి ఉందని స్వామి హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ ఎంపీగా ఉన్న సుబ్రమణ్యస్వామి ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ వ్యక్తం చేసిన అనుమానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ వీడియో పోస్ట్ అయిన కొద్ది గంటల్లోనే దాదాపు 14 వేల మంది చూశారు. ఏదో ఒక ఆధారం లేకుండా మాట్లాడరని పేరున్న సుబ్రమణ్యస్వామి ఇప్పుడు బిపిన్ రావత్ మృతిపై వ్యక్తంచేసిన అనుమానాలపై కేంద్రం కానీ, బీజేపీ నేతలు కానీ, అధికారులు కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇవాళ దుర్ఘటన తర్వాత రావత్ మృతిపై దేశవ్యాప్తంగా పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.