కర్ణాటక రిజల్ట్స్: లింగాయత్లను చీల్చి కాంగ్రెస్ ఆత్మహత్య: సుబ్రమణ్యస్వామి
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా కన్పిస్తున్నాయి. బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు వెనుకంజలో ఉన్నారు. ఈ తరుణంలో బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై విమర్శలు గుప్పించారు.
లింగాయత్లను చీల్చి కాంగ్రెస్ పార్టీ చీల్చిన రోజునే కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకొందని నేను ఆనాడే చెప్పానని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా సుబ్రమణ్యస్వామి మంగళవారం నాడు స్పందించారు.
లింగాయత్లకు మైనార్టీ హోదా కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయం ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని సిద్దరామయ్య భావించారు. కానీ, ఎన్నికల ఫలితాలను చూస్తే అందుకు విరుద్దంగా కన్పిస్తోంది.
లింగాయత్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ లింగాయత్లకు ఇచ్చిన హమీలు ఏ మాత్రం ఆ పార్టీకి కలిసిరాలేదని ట్రెండ్స్ ను బట్టి తేలుతోంది.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడ తారుమారయ్యాయి.