బీజేపీ కొత్త ముఖ్యమంత్రి ఆయనే: సాయంత్రమే ప్రమాణ స్వీకారం: కేబినెట్ లిస్ట్ కూడా రెడీ
డెహ్రాడున్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ ఎన్నికయ్యారు. ఈ మేరకు అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షం.. ఆయనను తమ నేతగా ఎన్నకుంది. కొద్దిసేపటి కిందటే తీరథ్ సింగ్ రావత్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరథ్ సింగ్ రావత్ నియమితులైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. 2019 నాటి ఎన్నికల్లో గర్వాల్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా అనంతరం ఆయన వారసుడిగా ప్రకటించడానికి బీజేపీ అధిష్ఠానం పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ధన్సింగ్ రావత్, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీనియర్ నేత, సత్పాల్ మహరాజ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బరూణీ.. వంటి నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. వాటన్నింటినీ కాదని.. బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా, లోక్సభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న తీరథ్ సింగ్ రావత్ పేరును ఖరారు చేసింది.

డెహ్రాడూన్లో నిర్వహించిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు తీరథ్ సింగ్ పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ సమావేశానికి అబ్జర్వర్లుగా.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ఎమ్మెల్యేలు భరత్ చౌధురి, సురేష్ రాథోర్, దుష్యంత్ కుమార్ గౌతమ్, ఎంపీ సత్పాల్ మహారాజ్ వ్యవహరించారు. తీరథ్ సింగ్ రావత్.. ఈ సాయంత్రం 4 గంటలకుక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొద్దిసేపట్లో ఆయన గవర్నర్ బేబి రాణి మౌర్యను కలుసుకోనున్నారు.
బీజేఎల్పీ నేతగా ఎన్నికైనట్లుగా శాసనసభ్యులు సంతకాలు చేసిన పత్రాన్ని గవర్నర్కు అందజేస్తారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఆరంభం కానున్నాయి. ఉత్తరాఖండ్ కేబినెట్ కూడా ఈ సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలుస్తోంది. 12 మందితో కూడిన కేబినెట్ జాబితాను ఇప్పటికే ఖరారు చేశారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కేబినెట్లో పనిచేసినవారిలో కొందరిని కొనసాగించడంతో పాటు.. కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications