ఏడుగురు కేంద్రమంత్రుల్ని తిరిగి రాజ్యసభకు పంపని బీజేపీ ? కారణమిదే..!
దేశంలోని 15 రాష్ట్రాల్లో ఉన్న 56 రాజ్యసభ స్ధానాలకు ద్వైవార్షిక ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి. ఈ నెల 27న జరిగే ఈ ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలకు చెందిన పలువురు అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎన్నికల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఏడుగురు కేంద్రమంత్రుల్ని మరోసారి బీజేపీ నామినేట్ చేయకపోవడం ప్రాధాన్యం సంతరిచుకుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), జూనియర్ ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక), పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య మంత్రి పుర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, జూనియర్ విదేశాంగ మంత్రి వి మురళీధరన్ లకు ఈసారి బీజేపీ రాజ్యసభ టికెట్లు నిరాకరించింది.

అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రమంత్రులుగా ఉన్న వీరిని కాదని ఇతరులకు బీజేపీ రాజ్యసభకు పంపుతోంది. అదే సమయంలో వీరిని లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దింపబోతోంది. ఈసారి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి బలంగా ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దింపితే సునాయాసంగా గెలిచి వస్తారని బీజేపీ లెక్కలేస్తోంది. దీంతో వీరికి బదులుగా ఇతరుల్ని రాజ్యసభకు పంపుతోంది.












Click it and Unblock the Notifications