సోనోవాల్కు బీజేపీ హైకమాండ్ షాక్ -సిట్టింగ్ సీఎంపై అపనమ్మకం -ఫలితాల తర్వాతే పేరు ప్రకటన
అస్సాంలో అధికార బీజేపీకి గడ్డు పరిస్థితి తప్పదన్న అంచనాలకు తోడు సిట్టింగ్ ముఖ్యమంత్రికి సొంత అధిష్టానమే షాకివ్వడం సంచలనంగా మారింది. సీఎం సర్బానంద సోనోవాల్ ఆధ్వర్యంలో అస్సాం సర్వతోముఖంగా అభివృద్ది చెందిందని చెబుతూనే.. ఈసారి మాత్రం ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించే అంశంలో హైకమాండ్ వెనుకడుగు వేసింది.
ఎన్నికల కంటే ముందే తాము సీఎం అభ్యర్థిని ప్రకటించబోమని అస్సాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. సీఎం ఎవరన్నది బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని సీఎం సర్బానంద సోనోవాలా, మంత్రి హిమవంత విశ్వాస శర్మ కూడా ప్రకటించడం గమనార్హం.

అయితే 2016 ఎన్నికల ముఖచిత్రంతో పోలిస్తే ఇది భిన్నం. ఆ సమయంలో సోనోవాలాయే ముఖ్యమంత్రి అని బీజేపీ ఎన్నికల కంటే ముందే ప్రకటించింది. ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లింది. అయితే దీనిపై బీజేపీ అధ్యక్షుడు వివరణ ఇచ్చారు. ''అప్పట్లో మేము ప్రభుత్వంలో లేము. అందుకే సీఎం పేరును ప్రకటించాం. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం. అందుకే సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు. ఈ విషయంపై ఏ బీజేపీ కార్యకర్త కూడా అడగలేదు. కేవలం మీడియా మాత్రమే అడుగుతోంది.'' అని బీజేపీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ రుసరుసలాడారు. మరోవైపు..
ఎన్నికల వేళ అధికార బీజేపీకి షాకిస్తూ సోనోవాల్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన బీజేపీ నేత సమ్ రోంగ్హంగ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏఐసీసీ సెక్రటరీ జితేంద్ర సింగ్, అస్సాం కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా సమక్షంలో సమ్ రోంగ్హంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనకు బీజేపీ టికెట్ కేటాయించకపోవడం తీవ్రంగా బాధించిందని, ఇకపై కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని సమ్ తెలిపారు..
మొత్తం 126 శాసనసభ స్థానాలు ఉన్న అసోంలో మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో భాగంగా 12 జిల్లాల్లోని 47 స్థానాలకు మార్చి 27న పోలింగ్ జరగనుంది. రెండో దశలో భాగంగా 13 జిల్లాల్లోని 39 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1న, తుది దశలో భాగంగా 12 జిల్లాల్లోని 41 స్థానాల్లో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. ఈసారి బీజేపీ 92 స్థానాలకు పోటీ చేస్తూ, తన మిత్రపక్షమైన అసోమ్ గణ పరిషత్ (ఏజీపీ)కి 26 సీట్లు, పీపుల్స్ పార్టీ లిబరల్స్కు 8 సీట్లు కేటాయించింది.












Click it and Unblock the Notifications