3 నుంచి 2కు.. ఆ తర్వాత 2 నుంచి 1కి.. ఇదీ భారతీయ జనాపార్టీ (BJP) వ్యూహం!!
శూన్యంలో నుంచి ఏవైనా వస్తువులు సృష్టిస్తే అది మ్యాజిక్ అంటారు. నైపుణ్యమున్న మెజీషియన్లు మాత్రమే అలా చేయగలరు. ప్రజలు కూడా అటువంటి కార్యక్రమాలు చూడటానికి పోటెత్తుతుంటారు. అలాగే.. అక్కడ అసలు పార్టీయే లేదు.. అనుకున్నచోట అధికారాన్ని సృష్టించి అద్భుతాలు చేయడం భారతీయ జనతాపార్టీకి అలవాటుగా మారింది. అది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలా? ఉప ఎన్నికలా? ఆ రాష్ట్రంలో బలంగా ఉన్నామా? బలహీనంగా ఉన్నామా? అనేది కూడా ఆ పార్టీకి అనవసరం. అధికారం కోసం స్థానికంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసి అందుకనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవడమే వారు చేసే పని.

ప్రతిపక్షాన్ని బలహీనపరిచి..
కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించి అధికారం చేజిక్కించుకున్నారు. తమిళనాడుపై దృష్టిసారించారు. అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీర్ సెల్వం బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. అనేక రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ అధినాయకత్వానికి తెలంగాణ అయినా, ఏపీ అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా కైవసం చేసుకోవడం పెద్ద పనికాదు అనేది వారి భావన. ఏ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావాలనుకుంటున్నారో ముందుగా ఆ రాష్ట్రంపై అధినాయకత్వం దృష్టిసారిస్తుంది. అక్కడి పరిస్థితులను అంచనా వేసి ముందుగా ప్రతిపక్ష పార్టీ బలం, బలహీనతలను తెలుసుకుంటారు. తర్వాత రెండోస్థానంలో ఉన్న పార్టీని బలహీనపరిచే వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభిస్తారు.

ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ఆలోచన కలిగేలా..
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రధాన పార్టీలు రెండు ఉండటం సహజం. అధికార పక్షం, ప్రతిపక్షం. అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే తాము మూడోస్థానంలో ఉన్నా, నాలుగో స్థానంలో ఉన్నా.. రెండోస్థానాన్ని లక్ష్యంగా ఎంచుకుంటారు. ముందుగా ప్రతిపక్షాన్ని బలహీనపరచడం ప్రారంభిస్తారు. ఆ పార్టీని మానసికంగా దెబ్బకొడతారు. ప్రతిపక్షంలోని నేతలను బీజేపీలోకి తీసుకువచ్చేలా ''ఆపరేషన్ ఆకర్ష్'' అమలు చేస్తారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అనే ఆలోచన కలిగేలా చేస్తారు. వీటన్నింటికీ కేంద్రంలో అధికారంలో ఉండటమే బీజేపీకి కలిసివచ్చే అంశం.

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోందదే?
వరుసగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వస్తోన్న బీజేపీ తెలంగాణలోను అదే తరహాలో అధికారంలోకి రావాలనుకుంటోంది. దీనికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. అన్నివైపుల నుంచి నేతలను టీఆర్ఎస్వైపు మొహరించింది. డీకే అరుణ నుంచి ఈటెల రాజేందర్ వరకు అందరూ కాషాయ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా చేరబోతున్నారు. గత ఎన్నికల్లో 107 నియోజకవర్గాల్లో డిపాజిట్ దక్కలేదు. కానీ ప్రజలంతా ఇప్పుడు టీఆర్ఎస్ కాకుండా బీజేపీవైపు చూసేలా చేయడమే నేతల ప్రణాళిక. వాస్తవానికి ప్రతిపక్షంగా కాంగ్రెస్ బలంగానే ఉందని చెప్పవచ్చు. ప్రతిపక్షం బలంగా ఉంటే అధికారం చేజిక్కించుకోవడం కష్టం. అందుకే ముందుగా రెండోస్థానంలోని పార్టీపై మైండ్ గేమ్ అమలుచేసి ఆ స్థానానికి చేరుకుంటారు. ప్రస్తుతం జరుగుతోంది అదే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడటానికి కారణం ప్రతిపక్షాను బలహీనపరిచి ఆ స్థానానికి చేరుకోవడమే.!!












Click it and Unblock the Notifications