కేజ్రీవాల్ బంపర్ ఆఫర్: మోడీకి సిద్ధూ ఝలక్, రాజ్యసభకు రిజైన్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సోమవారం నాడు రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని, పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
త్వరలో పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సిద్ధూను ఏఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చాలా రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లకు బలం చేకూరుస్తూ సిద్ధూ ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం గమనార్హం.
ఆయనను రెండు నెలల క్రితమే బీజేపీ రాజ్యసభకు పంపించింది. చాలా కాలంగా ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తితో కనిపిస్తున్నారు. అదే సమయంలో ఏఏపీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు గాలం వేశారు.

ఆయన ప్రయత్నం ఫలించిందని, అందులో భాగంగానే సిద్ధూ రాజ్యసభకు రాజీనామా చేశారని అంటున్నారు. సిద్ధూతో చాలా రోజులుగా ఏఏపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. సిద్ధూ రాజ్యసభతో పాటు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారని అంటున్నారు.
పంజాబ్లో బీజేపీ - అకాలీదళ్ మిత్రపక్షాలు. సిద్ధూ భార్య కూడా బీజేపీ నాయకురాలు. ఆమె కూడా ఆ పార్టీకి రాజీనామా ఏఏపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొద్ది నెలల క్రితం ఆమె తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు బీజేపీ నుంచి సిద్ధూ, అతని భార్య.. ఇద్దరూ ఏఏపీలో చేరనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications