హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్ధుల తుది జాబితా విడుదల-ఎవరెక్కడంటే..
హిమాచల్ ప్రదేశ్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల్ని ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ ఇవాళ తమ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది.
ఇప్పటికే బీజేపీ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 62 సీట్లకు తొలి జాబితాలోనే అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఇవాళ మిగిలిన ఆరుగురు అభ్యర్ధుల్ని రెండో జాబితాలో ప్రకటించింది. దీంతో బీజేపీ అభ్యర్ధుల ప్రకటన పూర్తయినట్లయింది. రెండో దశలో విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాలో డేరా, జ్వాలాముఖి, కుల్లూ, బర్సార్, హరోలీ, రాంపూర్ సీట్లున్నాయి.
డెహ్రా నుంచి బీజేపీ రమేశ్ ధావాలా, జవాలాముఖి నుంచి రవీందర్ సింగ్ రవి, కులు నుంచి మహేశ్వర్ సింగ్, బర్సార్ నుంచి మాయా శర్మ, బరోలి నుంచి రామ్కుమార్, రాంపూర్ (ఎస్సీ) నుంచి కౌల్ నేగి బరిలోకి దిగారు.తొలి జాబితాలో పేరున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తన నియోజకవర్గం సెరాజ్ నుండి పోటీ చేస్తుండగా, రాష్ట్ర ఆర్థిక సంఘం చీఫ్ సత్పాల్ సింగ్ సత్తి ఉనా నుండి పోటీ చేయనున్నారు.
తొలి జాబితాలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 19 మంది కొత్త ముఖాలను ప్రకటించింది. తొలి జాబితాలో ప్రకటించిన 62 మంది అభ్యర్థుల్లో 19 మంది కొత్త ముఖాలు, తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేష్ కశ్యప్ ప్రకటించారు.
బీజేపీ తరఫున టికెట్లు దక్కించుకున్నవారిలో ఐదుగురు డాక్టర్లు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు. సిమ్లాలోని ఐజిఎంసి ఆసుపత్రి సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జనక్ రాజ్కు భర్మౌర్ నుండి టిక్కెట్ ఇచ్చారు. ఇద్దరు అల్లోపతి వైద్యులు రాజేష్ కశ్యప్, అనిల్ ధిమాన్ సోలన్, భోరంజ్ నుండి రంగంలోకి దిగారు.
ఆయుర్వేద వైద్యులు రాజీవ్ సైజల్, రాజీవ్ బిందాల్లకు కూడా టిక్కెట్లు ఇచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేఆర్ కత్వాల్ ఝండుటా స్థానం నుంచి తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఐదుగురు మహిళలున్నారు. చంబా నుంచి తొలిసారిగా ఇందిరా కపూర్కు టిక్కెట్టు ఇచ్చారు. కేబినెట్ మంత్రి సర్వీన్ చౌదరి షాపూర్ స్థానం నుండి, పచాడ్ నుండి ఎమ్మెల్యే రీనా కశ్యప్, ఇండోరా స్థానం నుండి రీటా ధీమాన్ తన అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటున్నారు. ఈసారి కూడా రోహ్రు నుంచి మాజీ అభ్యర్థి శశిబాలకు టిక్కెట్టు ఇచ్చారు.