ఇవే మోడీ డిగ్రీలు : అమిత్ షా, కాదు అవి నకిలీ డిగ్రీలే : ఆప్
న్యూఢిల్లీ : కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలను తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకోవడం.. కేజ్రీవాల్ కు ఆ వివరాలు అందకముందే ఓ గుజరాత్ పత్రికలో ఆ వివరాలు వెల్లడికావడం తెలిసిన విషయమే. దీనిపై కేజ్రీవాల్ అసంత్రుప్తి కూడా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రధాని మోడీ విద్యార్హతలపై వివరణ ఇచ్చారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రధాని విద్యార్హతలపై వివరణ ఇవ్వాల్సి రావడం దురద్రుష్టకరమని చెప్పిన అమిత్ షా.. డీయూ నుంచి ప్రధాని పొందిన బీఏ డిగ్రీ పట్టాను, గుజరాత్ యూనివర్సిటీ నుంచి పొందిన ఎంఏ పట్టాను మీడియా ముందుంచారు.
నకిలీ డిగ్రీలని కేజ్రీవాల్ చేస్తోన్న తప్పుడు ఆరోపణలను తిప్పి కొట్టేందుకే మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రధాని విద్యార్హతల వివరాలను వెల్లడిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కాగా.. ఆప్ నేతలు మాత్రం అమిత్ షా చూపించిన డిగ్రీలన్ని నకిలేవేనని, ఫోర్జరీ సంతకాలతో ఆరోపించారు. మీడియా సమావేశం నిర్వహించి ఏదో డిగ్రీని చూపించినంత మాత్రాన, అమిత్ షా చెప్పిందే నిజమని నమ్మడానికి ఆయనేమి దేవుడు కాదని ఆప్ నేత అశుతోష్ అన్నారు.
డిగ్రీలో మోడీ తన పేరును ఎలా మార్పు చేసుకున్నారో అఫిడవిట్ కాపీతో సహా చూపించాలని డిమాండ్ చేసిన అశుతోష్.. నకిలీ డిగ్రీలను చూపించి అమిత్ షా. జైట్లీలు అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. తన వద్ద ఉన్న మోడీ విద్యార్హతల కాపీలకు, అమిత్ షా చూపించిన వాటికి చాలా తేడా ఉందని, దీంతో అవి నకిలీవేనని తేలిందన్న రీతిలో మాట్లాడారు అశుతోష్.