క్రైసిస్: 2019లో నవీన్ పట్నాయక్కు పరాభవమేనా?
ఒడిశాలోనూ భారతీయ జనతా పార్టీ పవనాలు వీస్తున్నాయి. తమ పార్టీని విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని అధికార బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) ఆరోపిస్తోంది.
భువనేశ్వర్: ఒడిశాలో గతనెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యధిక స్థానాలు గెలుచుకోవడం అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ)లో ప్రకంపనలు స్రుష్టిస్తోంది. సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
తద్వారా ఆయన సారథ్యంలోని ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ ఉనికి పెరుగుదలకు మీరే కారణమని బీజేపీ లోక్సభ సభ్యులు తథాగత సత్పథి, బైజాయత్ జై పాండ్యా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.
రాష్ట్ర మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు తోడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయం స్ఫూర్తితో వచ్చేనెల 15, 16 తేదీల్లో భువనేశ్వర్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో సథ్పతి, జై పాండ్య మధ్య పరస్పర ఆరోపణల పర్వం సాగుతుండటం గమనార్హం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు హాజరు కానున్నారు.
సథ్పతి ఆరోపణలు ఇలా
ఒడిశాలో బీజేపీ పవనాలు గట్టిగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీని, పార్టీ గుర్తును లాగేసుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ధెంకనాల్ లోక్సభ సభ్యుడు తథాగత సత్పథి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎంపీ పాండ్యను కమలనాథులు ప్రభావితం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో మాదిరిగా తమ పార్టీలోనూ విభేదాలను స్రుష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని తథాగత సత్ఫథి ధ్వజమెత్తారు. తద్వారా ఒడిశా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు పెట్టించేందుకు బీజేడీలో చీలిక తేవడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఇటీవల వరుస ట్వీట్లు కొట్టారు.
నవీన్ పట్నాయక్ పై పాండ్యా పరోక్ష దాడి
దీనికి ప్రతిగా అన్నట్లు బీజేడీ ఎంపీ పాండ్యా.. ఒడిశాలోని పాత కాలం నాటి దిన పత్రిక ‘ది సమాజ'లో ‘బిజెడి: ఆత్మశోధనకు ఇది సమయం' అనే శీర్షికన ఓ వార్తాకథనం రాశారు. పరోక్షంగా ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. ‘ఒకవేళ మనం నిజాయితీగా ఆత్మశోధన చేసుకుంటే.. 1997 నాటి రాజకీయ వాతావరణమే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నదని గుర్తుంచుకోవాలి. గత మూడేళ్లుగా అవినీతి విస్తరించడంతోపాటు క్రిమినల్ నేరాలకు పాల్పడే వారు పార్టీలో శక్తిమంతుల వద్ద తల దాచుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇతర పార్టీలు బలం పుంజుకుంటున్నాయని...
ఇతర పార్టీలు సమర్థ నాయకుల సారథ్యంలో క్షేత్రస్థాయిలో తమ పునాదిని బలోపేతం చేసుకుంటున్నాయని పాండ్యా తెలిపారు. ఒకవేళ బీజేడీ వ్యవస్థాపక అధినేత నవీన్ పట్నాయక్ పార్టీలో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్టికల్తోపాటు పాండ్యా గతంలో పలు జాతీయ ఇంగ్లిష్ దినపత్రికల్లోనూ విశ్లేషణలతో కూడిన వ్యాసాలు రాశారు. బీజేపీకి తాను దగ్గరవుతున్న తీరును వివరించడంతోపాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్పై పరోక్ష దాడులకు పూనుకున్నారు. సథ్పతి ట్వీట్ల ప్రకారం పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ఆ మాట అధినేత, రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ చెప్పాలని, ఇతరులెవ్వరో వ్యాఖ్యలు చేస్తే పట్టించుకోనవసరం లేదని తేల్చేశారు.
సద్వినియోగం చేసుకుంటున్న బీజేపీ
అంతర్గత విభేదాలతో అధికార బీజేడీ సతమతమవుతుంటే మరోవైపు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటూ 2019లో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమర సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలోని 21 లోక్ సభ స్థానాలకు బీజేడీ 20 గెలుచుకోగా, బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందగలిగింది. సుందర్ గఢ్ (ఎస్టీ) స్థానం నుంచి గెలుపొందిన జువాల్ ఓరం ప్రస్తుతం నరేంద్రమోడీ క్యాబినెట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు బీజేడీ 116 స్థానాలు గెలుచుకోగా, 16 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో, 10 స్థానాల్లో బీజేపీ గెలుపొంది మూడో స్థానంలో నిలిచాయి.
బీజేపీకి మెరుగైన స్థానాలు
ఒడిశాలో ఇటీవల ముగిసిన పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానాలు గెలుచుకోవడంతో 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవశం చేసుకోవడంతోపాటు లోక్ సభకు గణనీయ సంఖ్యలో ఎంపీలను గెలుచుకోగలమని బీజేపీ భావిస్తున్నది. తదనుగుణంగా బీజేడీ నుంచి అధికారాన్ని లాగేసుకునేందుకు బీజేపీ ఆందోళనలు నిర్వహిస్తున్నది. దీనికి తోడు అధికార బీజేడీలో గల విభేదాలను సొమ్ము చేసుకోవాలని బీజేపీ తలపోస్తున్నది.