బీజేపీకి రాంరాం: ఎల్జేపీలో చేరిన ఉషా విద్యార్థి, చక్రం తిప్పిన చిరాగ్ పాశ్వాన్..
బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయాలు మారిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అయితే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు కండువా మార్చడం చర్చకు దారితీసింది. బీజేపీ సీనియర్ నేత ఉషా విద్యార్థి.. లోక్ జనశక్తి పార్టీలో చేరారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సీనియర్ నేత ఉషా విద్యార్థి బీజేపీకి బుధవారం రాజీనామా చేశారు. ఆ వెంటనే లోక్జనశక్తి పార్టీలో చేరిపోయారు. బీహర్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నానని ఉషా విద్యార్థి పేర్కొన్నారు. అయితే బీహర్ ఫస్ట్. బీహరీ ఫస్ట్ అనే నినాదం తనను ఆకట్టుకొందని ఉషా ప్రకటించారు. ఉషా విద్యార్థిని పార్టీలో తీసుకురావడానికి చిరాగ్ పాశ్వాన్ పావులు కదిపారు.
చిరాగ్ పాశ్వాన్ వేసిన ఎత్తుగడ జేడీయూలో అలజడికి కారణమైందని తెలుస్తోంది. వాస్తవానికి ఉషాను జేడీయూలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఎల్జేపీలో చేరడంతో ఆ పార్టీకి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.
Recommended Video
మరోవైపు బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే జేడీయూ నితీశ్ కుమార్ నేతృత్వంలో తాము పనిచేయబోమని ఎల్జేపీ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎల్జీపీ నుంచి బీజేపీ నేతలు బరిలోకి దిగుతారనే జరిగిన ప్రచారం ఊహాగానాలకు బలం చేకూర్చింది. మరోవైపు బీజేపీ ఉపాధ్యక్షుడు రాజేంద్ర సింగ్ కూడా మంగళవారం ఎల్జేపీలో చేరారు. ఆయన ఇదివరకు జార్ఖండ్ ఇంచార్జీగా పనిచేశారు. అయితే బీజేపీలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎల్జేపీ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎల్జేపీ, బీజేపీ స్పందించాల్సి ఉంది.