ఇక టార్గెట్ మధ్యప్రదేశ్: అక్కడ మరో అజిత్ పవార్ సిద్ధం, ఆందోళనలో కాంగ్రెస్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ముసలం ఏర్పడిందా..? కమల్నాథ్ - జ్యోతిరాదిత్య సింధియా వర్గాలు విడిపోయాయా..? 20 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..? రెండు రోజులుగా వారీ ఆచూకీ కనిపించడం లేదనే వార్త మధ్యప్రదేశ్లో షికారు చేస్తోంది. మహారాష్ట్ర ఎపిసోడ్ మధ్యప్రదేశ్లో కూడా రిపీట్ కానుందా..? ఏం జరుగుతోంది.

కనిపించని 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్లో మరో రాజకీయ అనిశ్చితికి తెరలేవనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్లో గత రెండు రోజులుగా 20 మంది ఎమ్మెల్యేల ఆచూకీ దొరకడం లేదనే వార్త కాంగ్రెస్ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే సీఎం కమల్నాథ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియాల మధ్య నెలకొన్న విబేధాలు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జ్యోతిరాదిత్య సిందియాకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు గత 48 గంటలుగా కనింపించడం లేదనే వార్త జోరుగా షికారు చేస్తోంది.

ఎమ్మెల్యేల హస్తం వెనక బీజేపీ హస్తం ఉందా..?
మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేల అదృశ్యం వెనక కూడా బీజేపీ హస్తముందా అనే ప్రచారం ఊపందుకుంది. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం తమదే వస్తుందని కమల్నాథ్ ప్రభుత్వం చాలాకాలం ఉండదని పలువురు బీజేపీ నేతలు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యేలు అదృశ్యం కావడంతో ఆ అనుమానం మరింత బలపడింది. మహారాష్ట్రలో అజిత్ పవార్ను దువ్వినట్లే జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ గాలం వేసి ఉంటుందా అనే అనుమానాలు పలువురిలో నెలకొన్నాయి. అంతేకాదు జ్యోతిరాదిత్య సింధియా తన ట్విటర్ అకౌంట్ నుంచి కాంగ్రెస్కు సంబంధించిన పోస్టింగులను కూడా తొలగించడం వెనక ఏదో పెద్ద కథ నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్విటర్ అకౌంట్నుంచి కాంగ్రెస్ పోస్టింగులు తొలగింపు
తన ట్విటర్లో కాంగ్రెస్కు సంబంధించిన పోస్టులును తొలగించడం అదే సమయంలో ప్రొఫైల్లో పబ్లిక్ సర్వెంట్ , మ్యూజిక్ ఎంతూసియాస్ట్ అని మార్చుకోవడంతో కాంగ్రెస్కు మరో తలనొప్పి వ్యవహారంగా తయారైంది. గత కొంతకాలంగా మధ్యప్రదేశ్ పీసీసీ పదవిని జ్యోతిరాదిత్య సింధియా ఆశిస్తున్నారు. అయితే పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ హైకమాండ్ ఆ నిర్ణయంను పక్కకు పెట్టింది. ఇదే విషయం పై జ్యోతిరాదిత్య సింధియా అసంతృప్తితో ఉన్నారు. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంఛార్జిగా జ్యోతిరాదిత్యాను హైకమాండ్ నియమించినప్పటికీ, తను మాత్రం తన సొంత నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాడు.

కాంగ్రెస్కు జ్యోతిరాదిత్య గుడ్బై చెప్పనున్నారా..?
ఇక జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోస్టులు తొలగించడంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీకి షేక్హ్యాండ్ ఇస్తారనే వార్తలు జోరందుకున్నాయి. జ్యోతిరాదిత్య సింధియాను గత కొద్దికాలంగా కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టిందని దీనిపై తాను అసంతృప్తితో ఉన్నట్లు చెప్పిన కమలం పార్టీ నేత కైలాష్ విజయ్వర్గీయ... బీజేపీలో చేరతారా లేదా అనేదానిపై తనకు క్లారిటీ లేదన్నారు.

మధ్యప్రదేశ్లో బలబలాలు ఎలా ఉన్నాయి..?
ఇదిలా ఉంటే 231 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కు 115 సీట్లు ఉండగా బీజేపీకి 107 స్థానాలున్నాయి. బీఎస్పీకి 2 స్థానాలు, ఎస్పీకి ఒక స్థానం నలుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వెంటిలేటర్ పైనే ఉంది. ఇప్పుడు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆచూకీ కనిపించడం లేదంటే అక్కడ ఏదో గూడుపుఠాణీ జరుగుతుందనే విషయం అర్థమవుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యేలంతా జ్యోతిరాదిత్య సింధియా వర్గం వారు కావడం, అదే సమయంలో ఆయన ట్విటర్లో కాంగ్రెస్ పోస్టులను డిలీట్ చేయడం, ప్రొఫైల్ మార్చడం వంటివి చూస్తే మహారాష్ట్ర తర్వాత బీజేపీ మధ్యప్రదేశ్ను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications