హర్యానా ఎన్నికల్లో వినేష్ ఫోగట్ కు పోటీగా కెప్టెన్ యోగేష్ బైరాగీ-బీజేపీ రెండో లిస్ట్ రిలీజ్..!
పారిస్ ఒలింపిక్స్ లో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరుకున్నా బరువు వివాదంతో నిరాశ పరిచిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోబోతోంది. జులానా సీటు నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ఈ నేపథ్యంలో ఆమెకు పోటీగా బీజేపీ కెప్టెన్ యోగేష్ బైరాగీని రంగంలోకి దింపింది. ఇవాళ బీజేపీ 21 మంది అభ్యర్ధులతో హర్యానా ఎన్నికల కోసం తమ రెండో జాబితాను విడుదల చేసింది.
హర్యానాలోని జులానా సీటులో వినేష్ ఫోగట్ ను బరిలోకి దింపిన కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు సరైన అభ్యర్ధి కోసం వెతుకుతున్న బీజేపీకి కెప్టెన్ యోగేష్ బైరాగీ కనిపించారు. ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, బీజేపీ హర్యానా స్పోర్ట్స్ సెల్ కో కన్వీనర్ గా ఉన్న బైరాగీని ఫోగట్ కు సరైన ప్రత్యర్ధిగా ఆ పార్టీ భావించింది. దీంతో బైరాగీని సడన్ గా తెరపైకి తెచ్చింది. ఫేస్బుక్ ప్రొఫైల్లో బైరాగీ తనను తాను మాజీ పైలట్ గా చెప్పుకుంటున్నారు.

బీజేపీ ఇవాళ ప్రకటించిన రెండో అభ్యర్ధుల జాబితాలో నర్వానా, రోహ్తక్ స్థానాల నుంచి మాజీ మంత్రులు క్రిషన్ కుమార్ బేడీ, మనీష్ గ్రోవర్ కు చోటు దక్కింది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి సన్నిహితుడైన పవన్ సైనీని నారైన్గర్ స్థానం నుండి బీజేపీ పోటీకి నిలబెట్టింది. సత్పాల్ జాంబాను పుండ్రి సీటు నుంచి బరిలోకి దింపుతోంది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని లాడ్వా స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. గత వారం 67 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. ఇవాళ 21 మందితో రెండో లిస్ట్ విడుదల చేసింది. మిగిలిన పేర్లను కూడా త్వరలోనే ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications