సీఏఏ నిరసనలకు బీజేపీ కౌంటర్: దేశ వ్యాప్తంగా భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం భారతీయ పౌరులకు వ్యతిరేకం కాదని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచార ప్రక్రియ ప్రారంభించాలని శనివారం ప్రకటించింది.
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల రూపకల్పన కోసం సమావేశంలో కీలక చర్చ జరిగింది.
సమావేశం ముగిసిన అనంతరం బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. పౌరసత్వ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాబోయే పది రోజుల్లో పార్టీ 3 కోట్ల కుటుంబాలను సంప్రదిస్తుందని తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాలీ నిర్వహించడంతోపాటు దేశ వ్యాప్తంగా 250 మీడియా సమావేశాలు, 100 ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
2014కు ముందు దేశంలోకి వచ్చిన మైనార్టీలకు మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుందని వివరించనున్నట్లు యాదవ్ తెలిపారు. అదేవిధంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి హింసకు ప్రేరేపిస్తున్న ప్రతిపక్ష పార్టీల కుట్రలను తెలియజేస్తామన్నారు. అసత్యాలు చెప్పి ప్రజలను తమ కుట్రలో భాగస్వాములను చేస్తుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలపై ఆయన మండిపడ్డారు.