మోదీ 70వ బర్త్ డే:బీజేపీ భారీ ప్లాన్ - 14 నుంచి 20 వరకు ‘సేవా సప్త్’- శ్రేణులకు హైకమాండ్ ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను ఘనంగా నిర్వహించేందుకు అధికార బీజేపీ భారీ సన్నాహాలు చేస్తున్నది. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు 'సేవా సప్త్' పేరుతో వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. 70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా హైకమాండ్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
మోదీ 70వ బర్త్ డే సందర్భంగా నిర్వహించే సేవా వారోత్సవాల్లో భాగంగా ప్రతి మండలంలో 70 మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను, దృష్టి లోపం ఉన్న 70 మందికి కళ్లజోళ్లను అందజేస్తారు. 70 ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు అందజేయనున్నారు. ప్రతి మండలంలో 70 మందితో ప్లాస్మా దానం శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ అన్ని రాష్ట్రాల పార్టీ చీఫ్ లకు సర్క్యులర్లు పంపారు. అలాగే,
సేవా వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు అన్ని పెద్ద రాష్ట్రాల్లో కనీసం 70 చోట్ల, చిన్నరాష్ట్రాల్లో జిల్లాకు ఒకటైనా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, బూత్ స్థాయిలో కనీసం 70 మొక్కలు నాటాలని, ప్రతి జిల్లాలోని 70 గ్రామాలను సందర్శించి, స్వచ్ఛతా పనులు చేపట్టాలని, జిల్లా కేంద్రాల్లో 70 బహిరంగ ప్రదేశాల్లో క్లీన్ నెస్ డ్రైవ్ చేపట్టాలని బీజేవైఎం చీఫ్ పూనమ్ మహాజన్ శ్రేణులకు సూచించారు. వీటితోపాటు..
Recommended Video
ప్రధాని మోదీ 70వ బర్త్ డే సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సాధించతలపెట్టిన లక్ష్యాలను వివరిస్తూ 70 వర్చువల్ కాన్ఫరెన్సులను వెబినార్ ద్వారా నిర్వహించనున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన 70 స్లైడ్స్ ను సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు. ఆయా చోట్ల జరిగే సేవా వారోత్సవాల్లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, తప్పనిసరిగా పాల్గొనాలని, సేవా సప్త్ కార్యక్రమాలు అన్నిటిలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.