షాక్: కరోనాకు మోదీ సోదరుడు బలి -సుశీల్ తమ్ముడు అరుణ్ కుమార్ మోదీ ఇక లేరు -విఫలయత్నం
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విలయం అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతూ వేల మందిని బలితీసుకుంటున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం కొత్తగా 3,92,576 కేసులు, 3865మరణాలు నమోదయ్యాయి. మొదటి వేవ్ లో బతికిపోయాయనుకున్న రాష్ట్రాల్లో ప్రస్తుత రెండో వేవ్ కలకలం సృష్టిస్తున్నది. ప్రధానంగా తూర్పు రాష్ట్రం బీహార్ లో వైరస్ వ్యాప్తి భయానకంగా పెరుగుతూ, వందలాదిమంది పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్ రాజకీయాల్లో తిరుగులేని మోదీ కుటుంబీకులను సైతం వైరస్ బలితీసుకుంది..
బీజేపీ టాప్ నేతల్లో ఒకరు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కుటుంబంలో కరోనా విషాదం నింపింది. సుశీల్ మోదీ చిన్న తమ్ముడు అశోక్ కుమార్ మోదీ (65) కొవిడ్ వ్యాధితో చనిపోయారు. కొద్ది రోజుల కిందట పాజిటివ్ గా నిర్ధారణ అయి, పాట్నాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 2.45గంటలకు తుది శ్వాస విడిచారు.

''నా చిన్న తమ్ముడు అశోక్ కుమార్ మోదీ కొవిడ్-19 కారణంగా కన్నుమూశారు. ఆయనను బతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు'' అని సుశీల్ మోదీ ట్వీట్ చేశారు. అశోక్ మోదీ మృతిపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి బీజేపీ నేతలు సంతాపాలు తెలిపారు. అన్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని అశోక్ మోదీ బినామీ ఆస్తులు పోగేశారనే ఆరోపణలున్నాయి. కాగా,
బీహార్ లో కొవిడ్ వ్యాప్తి పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. కొత్తగా 13,789 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4.84లక్షలకు, మొత్తం మరణాలు 2,642కు పెరిగాయి. ప్రస్తుతం 1లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయక్కడ. కోవిడ్తో ప్రధాని నరేంద్రమోదీ చిన్నమ్మ నర్మదాబెన్ సైతం కన్నుమూసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications