పక్షం గడిచినా పనిచేయని బీజేపీ వెబ్ సైట్
ఢిల్లీ : టెక్నాలజీ వాడకం గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 15 రోజుల క్రితం హ్యాకింగ్ కు గురైన బీజేపీ అధికార వెబ్ సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ వెబ్ సైట్ ను హ్యాకింగ్ నుంచి రక్షించుకోలేని వారు దేశాన్ని ఎలా కాపాడుతారని ఎద్దేవా చేస్తున్నాయి.
15రోజులుగా పనిచేయని బీజేపీ వెబ్ సైట్
అధికార బీజేపీ పార్టీ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురై 15 రోజులు దాటింది. అయినా ఆ పార్టీ ఇప్పటి వరకు దాన్ని పునరుద్ధరించలేదు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వైబ్ సైట్ కేవలం కొన్ని నిమిషాల పాటే హ్యాకింగ్ కు గురైందని, చిన్న చిన్న సాంకేతిక సమస్యల కారణంగానే ప్రస్తుతం వెబ్ సైట్ పనిచేయడం లేదని చెబుతున్నారు. మరోవైపు సైబర్ ఎక్స్ పర్ట్స్ మాత్రం హ్యాకింగ్ కారణంగా ఎంత పెద్ద సమస్య తలెత్తినా ఒకట్రెండు రోజుల్లో పరిష్కరించవచ్చని అంటున్నారు. ఎన్నికల సమయం కావడం, హ్యాకర్లు మళ్లీ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నందునే ఆలస్యమై ఉంటుందని చెబుతున్నారు. అయితే బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా మాత్రం ఈ అంశంపై స్పందించకపోవడం విశేషం.
ప్రతిపక్షాల విమర్శలు
ఎన్నికల సమయం కావడంతో అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. వెబ్ సైట్ హ్యాక్ అయి 15 రోజులు గడిచినా పునరుద్ధరించలేని పార్టీ దేశాన్ని ఎలా కాపాడుతుందని ప్రశ్నించింది. చౌకీదార్లమని చెప్పుకుంటున్న నాయకులు ముందు తమ అధికారిక వెబ్ సైట్ ను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలని ట్వీట్ చేసింది.
ఎన్డీటీవీ విశ్లేషణ : యూపీ కోటాలో బీజేపీకి బీటలు, దెబ్బకొడుతోన్న ఎస్పీ, బీఎస్పీ కూటమి
మార్చి 5న హ్యాకైన బీజేపీ వెబ్ సైట్
భారతీయ జనతాపార్టీ కి చెందిన అధికారిక వెబ్ సైట్ మార్చి 5న హ్యాకింగ్ కి గురైంది. హ్యాకర్లు మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో పాటు ఆయన దేశ ప్రజలను మోసం చేశారనే అర్థం వచ్చేలా మీమ్స్ క్రియేట్ చేసి పెట్టారు. దీన్ని గమనించిన కొందరు యూజర్లు ఫిర్యాదు చేయడంతో బీజేపీ తమ వెబ్ సైట్ ను వెంటనే నిలిపేసింది. అప్పటి నుంచి వెబ్ సైట్ మెయింటెనెస్ పని నడుస్తున్నదని, త్వరలోనే తిరిగి మీ ముందుకు వస్తామన్న సందేశం కనిపిస్తున్నది. హ్యాకింగ్ జరిగి 15 రోజులు దాటినా సైబర్ ఎక్స్ పర్ట్ లు సైతం ఎవరు హ్యాక్ చేశారన్న విషయాన్ని గుర్తించలేకపోవడం కొసమెరుపు.