ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ సంచలన ప్రకటన.. సీఎం క్యాండిడేట్ లేరు.. బాధ్యత మొత్తం ప్రధాని మోదీదే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం జాతీయ పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాలే సీఎం అభ్యర్థి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో అవసరానికి మించి.. ఓ పది మంది దాకా సీఎం క్యాండిడేట్లున్నారు. ఇటు బీజేపీలోనూ సీఎం క్యాండేట్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
పీఎం వర్సెస్ సీఎం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించకుండా పోరాడుతామని జవదేకర్ చెప్పారు. ఢిల్లీలో ఉండే ప్రధాని నరేంద్ర మోదీనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారకర్తగా, వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకుంటారని, మోదీ సారధ్యంలోనే తామంతా పనిచేస్తామని మంత్రి తెలిపారు. కేజ్రీవాల్ ను ఢీకొట్టేలా ఒక సమఉజ్జీని ప్రకటించబోమని స్పష్టం చేశారు.

గెలిచేది బీజేపీనే..
సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించకుండా గతంలోనూ బీజేపీ పలు రాష్ట్రాల్లో విజయం సాధించిందని జవదేకర్ గుర్తుచేశారు. చాలా రాష్ట్రాల్లో కొత్త నాయకత్వం ఇప్పడిప్పుడే తయారవుతోందని, కొన్ని చోట్ల మాత్రం నాయకత్వ సహస్య ఉందని ఆయన అంగీకరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే గెలుస్తుందన్న ఒపీనియన్ పోల్స్ అంచనాలను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. అప్పట్లో అన్నా హజారే మూమెంట్ వల్ల కేజ్రీవాల్ లాభపడ్డారని, ఇప్పుడా పరిస్థితులు లేవని, గెలవబోయేది బీజేపీనే అని జవదేకర్ అన్నారు.












Click it and Unblock the Notifications