'యువతలో మార్పులు, ఆ రెండు జరిగితే 2019లో బీజేపీకి 350 సీట్లు ఖాయం'
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సులభంగా 350 సీట్లు గెలుచుకుంటుందా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తే, అలాగే బెయిల్ గాడీ అంటే అవినీతికి పాల్పడి, బెయిల్ పైన ఉన్న కాంగ్రెస్ నేతలు తీహార్ జైలుకు వెళ్తే బీజేపీ సులభంగా 350 స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు.
సీబీఐలో బదలీలు, వివాదంపై అరుణ్ జైట్లీ వివరణ: 'కొత్త చీఫ్ నాగేశ్వర రావు కూడా అవినీతిపరుడే'
యువతలో జాతీయవాదం, హిందుత్వవాదం పెరగడం లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
బీజేపీ గెలిచేందుకు ఎన్నో అవకాశాలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అందుకు కారణాలు ఉన్నాయని తెలిపారు. యువతలో జాతీయవాదం పెరుగుతోందన్నారు. అలాగే హిందుత్వభావాలు పెరుగుతున్నాయని చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే, బెయిల్ గాడీ తీహార్ జైలుకు వెళ్తే బీజేపీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందన్నారు.
బెయిల్ పైన తిరుగుతున్నారు
గతంలో నేరాలు చేసిన కొంతమంది కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు ఇప్పుడు బెయిల్ పైన తిరుగుతున్నారని ప్రధాని మోడీ, సుబ్రహ్మణ్య స్వామి, ఇతర బీజేపీ నేతలు గతంలో అన్నారు. వారిని బెయిల్ గాడీగా పిలుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ఓసారి మాట్లాడారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అదే బెయిల్ గాడీ పేరుతో ట్వీట్ చేశారు.
టార్గెట్ మోడీ, బీజేపీ
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఓడించేందుకు విపక్షాలు ఒక్కటవుతున్నాయి. బీజేపీ టార్గెట్గా ఇప్పటి నుంచే పలు పార్టీలు పని చేస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ, సీపీఎం, సీపీఐ.. ఇలా అన్ని పార్టీలు దాదాపు ఏకం అయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సర్వేలు బీజేపీ వైపే
వచ్చే ఎన్నికల్లో విపక్షాల పొత్తులను బట్టి బిజెపి ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే విషయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ 40 సీట్ల లోపు గెలుస్తుంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి, ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే బీజేపీ మరిన్ని సీట్లు ఎక్కువ సాధిస్తుంది. బీఎస్పీ, ఎస్పీ వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీకి దాదాపు 60 సీట్లు వస్తాయని భావిస్తున్నారు. దాదాపు పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గినా బీజేపీయే తిరిగి అధికారంలోకి వస్తుందని, మోడీ తిరిగి ప్రధాని అవుతారని పలు సర్వేల్లో తేలింది.