యూపీ ఎన్నికలు- 47 సీట్లలో హోరాహోరీ- గతంలో స్పల్పమార్జిన్లతో గట్టెక్కిన బీజేపీ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ముఖ్యంగా 403 సీట్లున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. విపక్ష సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న 47 సీట్లలో హోరాహోరీ పోరు తప్పడం లేదు. అయితే ఈ 47 సీట్లను బీజేపీ గతంలోనూ ఇలాగే సాగిన హోరాహోరీ పోరులో స్వల్ప మార్జిన్లతో గట్టెక్కడం విశేషం. దీంతో ఈసారి ఆ 47 సీట్లపై ఉత్కంఠ నెలకొంది.
యూపీ పోరులో బీజేపీ ఎదురీత
ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విపక్ష సమాజ్ వాదీ పార్టీ నుంచి యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ హోరాహోరీ పోరు ఎదుర్కోక తప్పని పరిస్ధితి. ఐదేళ్ల ప్రజా వ్యతిరేకతకు తోడు స్ధానికంగా నెలకొన్న పరిస్ధితులు, వివాదాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారిపోయాయి. దీంతో ఈసారి బీజేపీ ప్రతీ సీటునూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్ధితి. ఇది విపక్షాలకు వరంగా మారుతుండగా.. బీజేపీ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
47 సీట్లలో హోరాహోరీ
403 సీట్లున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో 47 సీట్లు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కేవలం 5 వేల మార్జిన్ తో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధులు సీనియర్లు కావడం, అధికార, విపక్షాల మధ్య సాగుతున్న హోరాహోరీ పోరు ప్రతీ ఎన్నికల్లో ఈ సీట్లను హాట్ సీట్లుగా మార్చేస్తున్నాయి. దీంతో ఈసారి కూడా ఆ 47 సీట్లలో ఎవరు గెలుస్తారనేది అధికార పీఠానికి కూడా అత్యవసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీతో పాటు విపక్ష సమాజ్ వాదీ, ఇతర పార్టీలు కూడా ఈ సీట్లను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి.
గతంలో గట్టెక్కిన బీజేపీ
2017లో జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ 47 సీట్లలో హోరాహోరీ పోరు సాగింది. ఎవరు గెలిచినా స్వల్ప మార్జిన్లతోనే బయటపడాల్సిన పరిస్ధితి. అలాంటి పరిస్ధితుల్లో ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో అత్యధిక సీట్లను స్పల్ప మెజారిటీతో దక్కించుకోవడంతో అధికార పీఠాన్ని సునాయాసంగా అందుకుంది. ఈ 47 సీట్లలోనూ మెజారిటీలో కేవలం 5 వేల లోపే అంటే అతిశయోక్తి కాదు.
2017 పోరులో బీజేపీకి ఈ 47 సీట్లలో 23 దక్కాయి. ప్రత్యర్ధి ఎస్పీకి 13 సీట్లు లభించాయి. అలాగే బీజేపీ ఈ 47 సీట్లలో 15 సీట్లలో రెండో స్ధానంలో నిలిచింది. అలాగే సమాజ్ వాదీ పార్టీ మరో 17 సీట్లలో రెండోస్ధానంలో నిలిచింది. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, అప్నాదళ్ తలో స్ధానం గెల్చుకున్నాయి.
పంజాబ్ లోనూ 26 సీట్లలో హోరాహోరీ
పంజాబ్ అసెంబ్లీ పోరులోనూ ఇలాగే హోరాహోరీగా పోరు సాగే 26 సీట్లు ఉన్నాయి. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో ఈ 26 సీట్లలో ఎవరు గెలిచినా మెజారిటీలు మాత్రం ఐదు వేలకు లోపే ఉంటాయి. ఈసారి కూడా వీటిపైనే అందరి దృష్టీ నెలకొంది. పంజాబ్ లో గతంలో 2017లో జరిగిన అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ వీటిలో 11 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. శిరోమణి అకాలీదళ్ 7, ఆప్ 6, బీజేపీ రెండు సీట్లు దక్కించుకున్నాయి. ఈసారి ఈ 26 సీట్లలో ఎవరికి ఎన్ని దక్కుతాయన్న దానిపైనే అధికారం కూడా ఆధారపడి ఉంటుందనే అంచనాలున్నాయి.