ప్రధాని సూచన తిరస్కరించిన రైతులు-చట్టాలు రద్దయ్యాకే ఇంటికెళ్తామన్న తికాయత్
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై రైతు సంఘాలు స్పందించాయి. వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని చేసిన ప్రకటనను వారు పూర్తిగా నమ్మడం లేదు.దీంతో వాస్తవంగా రైతు చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళ్తామని ప్రకటించాయి.
ప్రధాని మోడీ ఇవాళ రైతులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఇందులో కేంద్రం గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుల్ని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ఇకనైనా ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు వెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు. దీనిపై స్పందించిన రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని చేసిన ప్రకటనను తాము పూర్తిగా నమ్మడం లేదని రాకేష్ తికాయత్ వ్యాఖ్యానించారు. వాస్తవంగా చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళ్తామని ఆయన తెలిపారు. ప్రధాని చేసిన ప్రకటనపై రైతు సంఘాలు భేటీ అయి నిరసనపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్, యూపీలో ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేశారని, ప్రస్తుతానికి రైతు ఆందోళనలు విరమింపచేసి తద్వారా ఎన్నికల్లో లబ్దికి బీజేపీ ప్రయత్నిస్తోందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుల రద్దును ఆమోదించిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని అప్పటి వరకూ నిరసనలు కొనసాగించాలని రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాకేష్ తికాయత్ చేసిన ప్రకటన ఇందులో భాగమేనని తెలుస్తోంది.