కుప్పకూలిన స్టాక్ మార్కెట్: రూ.లక్షల కోట్లు ఆవిరి: పేటీఎం షేర్లు పాతాళానికి: దలాల్ స్ట్రీట్ దడదడ
ముంబై: స్టాక్ మార్కెట్లో ఇవ్వాళ రక్తపాతం కనిపించింది. షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. లక్షల కోట్ల రూపాయల మేర ఆస్తులు ఆవిరి అయ్యాయి. అన్ని సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్లన్నీ నెగెటివ్లో ట్రేడింగ్ అయ్యాయి. పేటీఎం షేర్లు పాతాళానికి పడిపోయాయి. ఇదివరకెప్పుడూ లేనివిధంగా వాటి ధర క్షీణించింది. స్టాక్ మార్కెట్ను నడిపించే రంగాలకు సంబంధించిన షేర్లన్నీ దాదాపుగా ఇవే పరిస్థితికి చేరుకున్నాయి. అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్ దడదడలాడింది. మొత్తంగా లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయింది.
డిన్నర్ విత్ కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ క్రేజీ క్యాంపెయిన్
1500కు పైగా..
సెన్సెక్స్.. ఇవ్వాళ 1500లకు పైగా పాయింట్లను నష్టపోయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఇలాంటి పతనం కనిపించలేదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి 1,546 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఒకదశలో 1,700 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ చివరి అరగంటలో కొంతవరకు పుంజుకోగలిగింది. తన నష్టాన్ని స్వల్పంగా పూడ్చుకోగలిగింది. నిఫ్టీ కూడా ఇదే పతనాన్ని చవి చూసింది. 619 పాయింట్లను నష్టపోయింది. 17,149 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ముగిసింది.
అమ్మకాల ఒత్తిళ్లు..
స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న అమ్మకాల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను భారీగా విక్రయించుకున్నారని, ఆ ఒత్తిడి మార్కెట్పై కనిపించిందని పేర్కొన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం వల్ల ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకున్నారని అభిప్రాయాలు నెలకొన్నాయి.
దెబ్బకొట్టిన మూడో త్రైమాసికం ఫలితాలు..
స్టాక్ మార్కెట్లో డ్రైవింగ్ ఫోర్స్గా భావించే కొన్ని కీలకమైన సెగ్మెంట్స్కు చెందిన కంపెనీలు- మూడో త్రైమాసికంలో నష్టాలను చవి చూడటం కూడా మార్కెట్ పతనానికి కారణమైందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ చొక్కలింగం అంచనా వేశారు. 2020 మే తరువాత ఈ స్థాయిలో మార్కెట్ పతనం కావడానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా ఓ కారణం అయ్యాయని ఎలిగ్జిర్ ఈక్విటీస్ డైరెక్టర్ దీపన్ మెహతా వ్యాఖ్యానించారు.
ఇంట్రాడే ట్రేడింగ్ అంతా..
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఇంట్రాడే మొత్తం ఎక్కడే గానీ మార్కెట్ పుంజుకోలేదు. తొలి గంట నుంచే సెన్సెక్స్ గ్రాఫ్ నేలచూపులు చూడటం మొదలు పెట్టింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, రియల్ ఎస్టేట్స్ సెగ్మెంట్స్కు సంబంధించిన షేర్ల ధరలన్నీ దారుణంగా పడిపోయాయి. ఐటీ, ఆటో, మెటల్, పవర్, ఫార్మాసూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ 2 నుంచి 6 శాతం మేర నష్టపోయాయి.
పేటీఎం ఘోరం..
పేటీఎం షేర్ మూడంకెలకు పడిపోయింది. వెయ్యి రూపాయలకు దిగవకు ట్రేడింగ్ అయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి పేటీఎం షేర్ ధర 916 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. నిజానికి- ఈ షేర్ కటాఫ్ ప్రైస్ ధర 2,150 రూపాయలు. ఒక్కో షేర్ మీద మొత్తంగా 1,234 రూపాయలను నష్టపోవాల్సి వచ్చింది ఇన్వెస్టర్లకు. ఇవ్వాళ ఒక్కరోజే రూ.44.30 పైసలను కోల్పోయింది. లిస్టింగ్ డే నాడు ఇన్వెస్టర్ల పంట పండించిన నైకా పరిస్థితి కూడా ఇంతే. గతంలో ఎప్పుడూ లేనివిధంగా నైకా షేర్ ధర 1,745 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఒక్కరోజే రూ.253.30 పైసలను నష్టపోయింది.