నల్లధనంపై ముందడుగు: రూ.9003 కోట్ల ఆస్తుల జఫ్తు
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ఓ ముందడుగు. నల్లధనం దాచిన వారు, నల్లధనం చలామణి చేసిన వారి పైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 173 ఛార్జీషీట్లను దాఖలు చేసింది. రూ.9003 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జఫ్తు చేసింది.
2013-14 ఏడాదితో పోలిస్తే జఫ్తు చేసిన ఆస్తుల సంఖ్యలో 400 శాతం పెరుగుదల ఉంది. క్రిమినల్ ఎఫ్ఐఆర్ల నమోదు సంఖ్యలో ఐదు వంతల శాతానికి పైగా పెరుగుదల ఉంది. నల్లధనం చలామణిలో ప్రమేయం ఉన్న వారి అరెస్టుల్లో ఆరువందల శాతం పెరుగుదల ఉంది.
ప్రాసిక్యూషన్ ఫిర్యాదుల దాఖలులో లేదా ఛార్జీషీటు దాఖలులో రెండువందల శాతం పెరుగుదల నమోదయింది. సంబంధిత నివేదికను నల్లధనంపై సుప్రీం కోర్టుకు నియమించిన ప్రత్యేక దర్యాఫ్తు బృందానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈడీ సమర్పించింది.
కాగా, నల్లధనం చలామణి కేసులు రికార్డ్ స్థాయిలో నమైదయ్యాయి. స్విట్జర్లాండ్ నల్లధనం చలామణి వివరాల నమోదు కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం తెలిసిందే. స్విట్జర్లాండులో 2014లో నల్లధనం చలామణికి సంబంధించి తమకు అందిన అనుమానిత కార్యకలాపాల నివేదిక సంఖ్య 1753గా ఉన్నట్లు పేర్కొంది. 2011లో ఈ సంఖ్య 1625గా ఉంది.