సీఎం రేసులో లేను: ఫడ్నవీస్, ఫలితాలపై శివసేన ట్విస్ట్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రి రేసులో తానున్నానన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి రేసులో ఎవరూ లేరని పార్టీ అధిష్ఠానం, ప్రజాభిప్రాయం మేరకు సీఎం నియామకం ఉంటుందన్నారు.
శివసేన తమ రాజకీయ ప్రత్యర్థి కాదని ఫడ్నవీస్ అన్నారు. శివసేనతో మైత్రి సైద్దాంతిక పరమైనదన్నారు.ఆ పార్టీతో పొత్తు విచ్చిన్నం బాధకారమే అన్నారు. బీజేపీకి సొంతగా పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీని విశ్వాసాన్నిస్తే... అమిత్షా బలానిచ్చారన్నారు. కానీ, మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తే ఫడ్నవిసే ముఖ్యమంత్రి అవుతారన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉండటంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు, తమ ఓటమికి సీఎం పృథ్వీరాజ్ చౌహానే కారణమని ఎన్సీపీ మండిపడింది.
శివసేన ట్విస్ట్

25 ఏళ్లపాటు బీజేపీతో కలసి పని చేసిన శివసేన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. మహారాష్ట్రలో మోడీ హవా బాగా పనిచేస్తోందని... శివసేన, కాంగ్రెస్ లను అధిగమించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఇది శివసేనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాగైనా అధికారం చేపట్టాలనే యోచనలో కొత్త స్నేహాలకు తెరలేపేందుకు సైతం సిద్ధమవుతోంది.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అలయెన్స్లకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. అవసరమైతే తన బద్ధ విరోధి కాంగ్రెస్తో జతకట్టేందుకు కూడా వెనుకాడటం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీకి మెజార్టీ రాకుంటే ఆ పార్టీతో తప్ప ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు.
మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని... ఏ పార్టీతో అయినా జతకట్టేందుకు సిద్ధమని, ఆయా పార్టీల సిద్ధాంతాలతో మేము ఏకీభవించనప్పటికీ వారితో కలుస్తామని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం స్పష్టం చేశారు. బీజేపీకి మద్దతిచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని శివసేన ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీని శివసేన బద్ధ శత్రువుగా భావించింది. నరేంద్ర మోడీని పైన విమర్శల వర్షం కురిపించేందుకు కూడా వెనుకాడలేదు.
అయితే, రెండు రోజుల క్రితం మాత్రం శివసేన తన పత్రిక సామ్నాలో మరో రకంగా స్పందించింది. తాము కలిసి పోటీ చేయనంత మాత్రాన బద్ధ వ్యతిరేకులం కాదన్నట్లుగా అభిప్రాయపడింది. ఇప్పుడు బీజేపీకి మేజిక్ ఫిగర్ రాకుంటే.. అనే ఆలోచనతో మరో కూటమికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications