ముఖ్యమంత్రి సభకు సమీపంలో భారీ పేలుడు.. హై అలర్ట్!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 'సమృద్ధి యాత్ర'లో భాగంగా సీవాన్ జిల్లాలో పర్యటిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ముఖ్యమంత్రి బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఓ ఇల్లు కూడా భారీగా దెబ్బతింది. ముఖ్యమంత్రి సభకు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అసలేం జరిగిందంటే?
హుస్సేన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్రమ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుడిని ముర్తుజా అన్సారీగా గుర్తించారు. అన్సారీ తన నివాసంలో అక్రమంగా టపాసులను తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పటాసులు తయారు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి పేలుడు జరిగిన ప్రాంతంలోని ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. చుట్టుపక్కల ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు.

భద్రతపై ఆందోళన
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా అంతటా భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, ఇలాంటి అక్రమ పటాసుల తయారీ కేంద్రంలో పేలుడు జరగడం భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎస్పీ పీకే ఝా ఆదేశాల మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పేలుడుకు కారణమైన పదార్థాలను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందాన్ని రంగంలోకి దించారు.
యథావిధిగా సీఎం పర్యటన
జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించారు. వివిధ అభివృద్ధి పనుల సమీక్షలో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications