రాహుల్ గాంధీని గుడిలోకి వెళ్లనీయని మహిళలు
ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి అసోం పర్యటనలో ఆదివారం నాడు ఊహించని షాక్ తగిలింది. పర్యటనలో భాగంగా ఓ ఆలయంలోకి ప్రవేశించాలనుకున్న రాహుల్ గాంధీని ఆరెస్సెస్, బీజేపీ నేతలు అడ్డుకున్నారు.
కొందరు మహిళలను ప్రవేశద్వారం వద్ద నిలబెట్టి రాహుల్ గాంధీ ఆలయ ప్రవేశం చేయకుండా అడ్డుకున్నారు. దీనిపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్, బీజేపీ నేతల చర్యలు ప్రధాని నరేంద్ర మోడీ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
'అసోం పర్యటనలో నిన్న బార్ పేటలోని ఓ ఆలయంలోకి ప్రవేశించాలనుకున్నాను. అయితే ఆరెస్సెస్, బీజేపీ నేతలు నన్ను అడ్డుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద మహిళలను వరుసపెట్టి నిలబెట్టి వారు నన్ను అడ్డుకున్నారు. వారి మనస్తత్వానికి అద్దం పడుతున్నాయ'ని రాహుల్ వ్యాఖ్యానించారు.

మోడీవి ప్రజా వ్యతిరేక విధానాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటులో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మోడీపై నిప్పులు చెరిగారు.
కేరళ పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ప్రధాని మోడీ అవమానించారన్నారు. ముఖ్యమంత్రిని అవమానించడం, అసోంలో ఆలయంలోనికి వెళ్లకుండా తనను అడ్డుకోవడం మోడీ ఆలోచనా విధానమని దుయ్యబట్టారు. తమతో పాటు కేరళ, అసోం సహా ఈ దేశ ప్రజలకు ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మోదీ తన పనితీరును మార్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications