అసోంలో బోడో మిలిటెంట్ల బీభత్సం, 32 మంది మృతి
గౌహతి: అసోంలో దారుణం జరిగింది. జాతీయ బోడోల్యాండ్ ప్రజాస్వామ్య కూటమి- (సాంగ్బిజీత్) (ఎన్డిఎఫ్బి-ఎస్)కి చెందిన మిలిటెంట్లు గురువారం అర్ధరాత్రి అస్సాంలోని రెండు జిల్లాల్లో హింసకు పాల్పడి బీభత్సం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 21 మంది వరకు అక్కడికి అఖ్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. 20 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగిన మిలిటెంట్లు ఎకె-47 వంటి అధునాతన తుపాకులతో కోక్రాఝర్ జిల్లా బలపర-1 గ్రామంలో బీభత్సం సృష్టించారు. శుక్రవారం తెల్లవారుజాము వరకూ గ్రామంలో వీరు వీరవిహారం చేశారు. మూడు ఇళ్లపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు.
గురువారం రాత్రి ఎన్డిఎఫ్బి తీవ్రవాదులు బక్సా జిల్లాలో విరుచుకుపడి ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని కాల్చి చంపారు. ఘటనలో చిన్నారి తీవ్ర గాయాలకు లోనైంది. సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మిలిటెంట్లు కోక్రాఝర్ జిల్లాలో హింసకు పాల్పడి 21మందిని బలితీసుకున్నారు.
అంతకుముందు బక్సా జిల్లాలో ఓ వ్యక్తిని మిలిటెంట్లు తీవ్రంగా గాయపరిచారు. ఎన్డిఎఫ్బి మిలిటెంట్ల హింసాకాండను ఉల్ఫాకు చెందిన సహాయ ప్రచార కార్యదర్శి అరుణ్ ఉదయ్ తీవ్రంగా ఖండించారు. హింసాకాండ జరిగిన కోక్రాఝర్ జిల్లాకు సైన్యాన్ని తరలించారు. ఈ విషాద ఘటటనల్లో శనివారం మధ్యాహ్నం వరకు 32 మంది చనిపోయారు.