షాక్: ఆసుపత్రి వద్ద ఘోరం... యువకుడిని పీక్కుతిన్న చీమలు!
ఆసుపత్రి బయట పడుకుని ఉన్న ఓ యువకుడిని చీమలు కుట్టి కుట్టి చంపేశాయి. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ యువకుడి మృతదేహం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద పడి ఉండడంతో ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించా
ఇండోర్: మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. ఆసుపత్రి బయట పడుకుని ఉన్న ఓ యువకుడిని చీమలు కుట్టి కుట్టి చంపేశాయి. ఈ ఘటన ఇక్కడి ప్రభుత్వ రంగ ఎం.వై. ఆస్పత్రిలో జరిగింది.
గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ మృతదేహం ఆసుపత్రి ప్రధానద్వారం వద్ద గత రాత్రి పడి ఉందని సంయోగితగంజ్ పోలీసులు తెలిపారు. అతడు ఏ సమయానికి మరణించాడో, మరణానికి కారణం ఏంటో, అసలు అతడెవరో అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఒకవేళ అతడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న పేషెంటా? అన్న విషయం కూడా తెలియలేదు. మృతుడి గురించి తమకు కూడా ఏమీ తెలియలేదని, ఆ విషయం పోలీసులు చూసుకుంటున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీఎస్ పాల్ తెలిపారు.
ఇండోర్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం జూన్ నెలలో కూడా ఒక జిల్లా ఆసుపత్రి లో ఇలాంటి ఘటనే జరిగింది. మార్చురీలో ఉన్న మూడు రోజుల పాప మృతదేహాన్ని చీమలు పీక్కుతిన్నాయి.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆ చిన్నారి మరణించిందని అప్పట్లో ఆరోపణలు రావడంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. చివరకు అది పోస్టుమార్టంకు కూడా పనికిరాకుండా పోయింది.