పుణే కేంద్రంగా సంచలన స్కామ్: 11వేల మంది అమెరికన్లను ఇలా ముంచేశారు!..
పుణే: పుణే కేంద్రంగా నడుస్తున్న ఓ బోగస్ కాల్ సెంటర్ భాగోతాన్ని అక్కడి పోలీసులు బయటపెట్టారు. పుణేలోని కొరెగావ్ పార్క్ సమీపంలో నడుస్తున్న ఓ కాల్ సెంటర్ పై సోమవారం రాత్రి దాడులు చేశారు. దాదాపు 11వేల మంది అమెరికన్ సిటిజెన్స్ ను ఈ కాల్ సెంటర్ టాక్సుల పేరుతో బెదిరించినట్టుగా తేల్చారు. కాల్ సెంటర్ నిర్వాహకులైన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇలా వెలుగులోకి:
పన్నుల్లో చెల్లింపులో జాప్యం చేస్తున్నందునా జరిమానా కట్టాలంటూ ఈ కాల్ సెంటర్ నిర్వాహకులు అమెరికన్లకు వల వేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మిన అమాయక అమెరికన్లు మోసపోతూ వస్తున్నారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన అమెరికా ఆదాయశాఖ, ఫెడరల్ ట్రేడ్ కమీషన్లు ఎట్టకేలకు దీన్ని గుర్తించాయి.

ఎట్టకేలకు బయటపెట్టారు..:
పుణే కేంద్రంగా ఈ తతంగమంతా కొనసాగుతోందని అమెరికన్ వర్గాలు పుణే పోలీసులకు సమాచారం అందించాయి. లక్షలాది డాలర్లు అప్పటికే పక్కదోవ పట్టినట్టు అమెరికన్ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. అమెరికన్ అధికారుల సమాచారంతో అప్రమత్తమైన పుణే పోలీసులు ఎట్టకేలకు ఈ మోసాన్ని బయటపెట్టారు.

అమెరికన్ సంస్థలనూ వాడుకున్నారు..:
అమెరికన్లకు ఫోన్లు చేసి టాక్స్ పెనాల్టీ పేరుతో బెదిరించడం.. నయానో.. భయానో.. వారి నుంచి డబ్బు గుంజడం ఈ కాల్ సెంటర్ నిర్వాహకుల పని. ఇందుకోసం పలు అమెరికన్ సంస్థలను కూడా పుణే కాల్ సెంటర్ నిర్వాహకులు ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. పెనాల్టీ విషయం నిజమేనని నమ్మిన చాలామంది అమెరికన్లు 500 నుంచి 1000 డాలర్ల వరకూ కాల్సెంటర్ నిర్వాహకులు చెప్పిన ఖాతాల్లో జమచేసినట్టు తేలింది.

ఇలాంటివే మరో రెండు..:
ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలను వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. పుణే కేంద్రంగా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ లాంటిదే దేశంలో మరో రెండు కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే వాటి వివరాలు మాత్రం ఇంకా వెల్లడికావాల్సి ఉంది. పుణే నుంచి రెండు స్పెషల్ టీమ్స్ ఈ కాల్ సెంటర్ల లొకేషన్లను గుర్తించేందుకు బయలుదేరాయి. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితులను పట్టుకునేందుకు కూడా వేట ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications