బాలీవుడ్ స్టార్ హీరోకు సోకిన కరోనా వైరస్: ఫామ్హౌస్లో రెస్ట్: బీజేపీ నేతల పరామర్శ
చండీగఢ్: దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదనడానికి తాజా ఉదాహరణ ఇది. సాధారణ ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధులు, టాప్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ మహమ్మారి వైరస్ బారిన పడటం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కోలుకున్న వారి సంఖ్య ఎక్కువే. అదే లిస్ట్లో మరొకరు చేరారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, భారతీయ జనతా పార్టీ సీనియర్ లోక్సభ సభ్యుడు సన్నీ డియోల్ కరోనా వైరస్ బారిన పడ్డారు.
కొంతకాలంగా ఆయన హిమాచల్ ప్రదేశ్లోని కులూలో ఉంటున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలింది. హిమాచల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమితాబ్ అవస్థి ఈ విషయాన్ని వెల్లడించారు. తన కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన కొద్దిరోజులుగా కులూలోని తన ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతరం ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యారు.
కోవిడ్ ప్రొటోకాల్కు అనుగుణంగా సన్నీ డియోల్తో పాటు ఆయన స్నేహితులు కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సన్నీ డియోల్కు వైరస్ సోకినట్లు తేలింది. అసింప్టోమేటిక్గా అధికారులు ధృవీకరించారు. కరోనా లక్షణాలు ఆయనలో కనిపించలేదు. దీనితో ఆయన హోమ్ క్వారంటైన్లో వెళ్లారు. ఫామ్హౌస్లోనే క్వారంటైన్ ఉంటున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నాయకులు ఆయనకు ఫోన్ ద్వారా పరామర్శించారు.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సన్నీ డియోల్ బీజేపీలో చేరారు. అనంతరం తన సొంత రాష్ట్రం పంజాబ్లోని గురుదాస్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. బీజేపీలో క్రియాశీలక నేతగా గుర్తింపు పొందారు. కొద్దిరోజుల కిందట ఆయన భుజానికి గాయమైంది. ముంబైలోని ఓ టాప్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. విశ్రాంతి కోసం కుల్లూ మనాలీకి వెళ్లారు. తన ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.