చైనాను నియంత్రించేందుకు!, సరిహద్దుకు భారీగా సైన్యాన్ని తరలించిన భారత్..
డోక్లా ప్రాంతంలోని ట్రై జంక్షన్లో భారత్ మరిన్ని అదనపు బలగాలను మోహరించింది.దాదాపు 2500మంది సైన్యాన్ని సరిహద్దులకు పంపించింది.
భూటాన్: చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన భూటాన్ లోని డోక్లాం ప్రాంతంలో గతకొద్ది రోజులుగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. చైనా సైన్యం దుందుడుకుగా వ్యవహరిస్తూ.. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తుండటంతో.. ఇరు దేశాల సైన్యం మధ్య యుద్దం ముంచుకొచ్చేలా పరిస్థితులు వేడెక్కుతున్నాయి.
సరిహద్దులో తెగబడ్డ చైనా: పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత్కు హెచ్చరిక!
ఈ నేపథ్యంలోనే డోక్లా ప్రాంతంలోని ట్రై జంక్షన్లో భారత్ మరిన్ని అదనపు బలగాలను మోహరించింది. చుంబీ లోయతో పాటు ఖంబా డీజాంగ్ ప్రాంతాల్లో చైనా అదనపు సైన్యాన్ని మోహరించడంతో.. భారత్ కూడా అదే వైఖరిని అవలంభించింది. దాదాపు 2500మంది సైన్యాన్ని అక్కడ మోహరించింది.
లడక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఉన్న 4,057 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖపై డోక్లాం ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల కమాండర్ల మధ్య దీనిపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఇరు దేశాల్లోను నెలకొంది.
కాగా, గ్యాంగ్ టక్ లోని 17వ డివిజన్, కిలింపాంగ్ లోని 27వ డివిజన్, బిన్నాగురిలోని 20వ డివిజన్ సైనిక దళాల్లోని పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయగల విభాగాలను సరిహద్దులకు భారత్ తరలించడం గమనార్హం. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న 63, 112 బ్రిగేడ్లకు వీరు అదనపు బలగాలుగా చేరనున్నారు.