యథేచ్ఛగా పాక్ కాల్పులు: మృత్యు నీడలో కశ్మీరీలు.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రాత్రీపగలు అనే తేడా లేకుండా బాంబులు వచ్చిపడుతుంటే ఆ గ్రామస్థులకు విసుగు వచ్చింది. ఇంక మావల్ల కాదంటూ ఊరు ఖాళీ చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని అర్నియా అనే పల్లె కథ ఇది.
న్యూఢిల్లీ: రాత్రీపగలు అనే తేడా లేకుండా బాంబులు వచ్చిపడుతుంటే ఆ గ్రామస్థులకు విసుగు వచ్చింది. ఇంక మావల్ల కాదంటూ ఊరు ఖాళీ చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని అర్నియా అనే పల్లె కథ ఇది. సరిహద్దు గ్రామం అన్న తర్వాత ఎంతో కొంత ఉద్రిక్తత మామూలే. కానీ ఎడతెరిపిలేకుండా కాల్పులు జరుపుతూ శతఘ్ని గుండ్లను పేలుస్తుంటే ఎలా? ఇంట్లో ఓ మూల టేబుళ్లు, కుర్చీలు అడ్డం పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపడం అంటే కష్టమే మరి. 'ఎడతెరిపి లేకుండా దాడులు జరుగుతున్నా ఇక్కడే ఉండిపోదామనుకున్నాం. కానీ గురువారం రాత్రి పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. రెండు శతఘ్ని గుండ్లు మా ఇంటి మీదకు వచ్చిపడ్డాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. ఓ గేదె చనిపోయింది' అని అనితాకుమార్ చెప్పారు.
దెబ్బ తిన్న ఇంటిని తిరిగి కట్టుకునే స్థోమత అనిత కుటుంబానికి లేదు. ప్రస్తుతం అనితా కుమార్ కుటుంబ సభ్యులు వేరే ఊరిలో తమ బంధువుల ఇంటిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఏడురోజులుగా పాక్ జరుపుతున్న కాల్పులతో ఊరివారి సహనం నశించిపోయింది. ఒకప్పుడు కళకళలాడిన అర్నియా ఇప్పుడు మానవ సంచారం లేక బోసిపోయింది. 'మేం ఊరు ఖాళీ చేయకపోతే పాకిస్థానీ శతఘ్ని గుండ్లు మా ప్రాణాలు తీయడం ఖాయం' అని ప్రీతమ్చంద్ అనే గ్రామస్థుడు వాపోయారు. ఆయన కుటుంబం జమ్ము ప్రాంతంలోని అల్లుడి ఇంటిలో తల దాచుకుంటున్నది.
నిర్జనంగా మారిన గ్రామాలు
ఇది కేవలం అర్నియా కథే కాదు. పాక్ సరిహద్దుల్లోని సుమారు 20 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటూ పోవడంతో ఊళ్లన్నీ నిర్జనంగా మారిపోయాయి. 'ఈ ప్రాంతంలో 60 శాతం ఇళ్లు దెబ్బ తిన్నాయి. మేం ఇల్లు ఖాళీ చేయకుంటే ఈపాటికే టపా కట్టేసే వాళ్లం' అని ప్రీతమ్ చంద్ చెప్పారు. గతవారం ఇద్దరు మరణించగా 19 మంది గాయపడ్డారు. సుమారు పదివేల మంది ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని స్థానిక పోలీసు అధికారి సురిందర్ చౌదరి చెప్పారు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు పగటిపూట పశువులకు దాణా వేసేందుకు ఊళ్లకు తిరిగి వస్తారు. నెత్తుటిమడుగులో పడిఉన్న పశువులు, అద్దాలు పగిలిన కిటికీలు, గోడలు, పైకప్పులు కూలిన ఇండ్లు వారికి దర్శనమిస్తుంటాయి. ఎటుచూసినా తూటాల గుర్తులే. శతఘ్ని గుండ్ల శకలాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. తుపాకీ మందు వాసన దట్టంగా వ్యాపించి ఉంటుంది.
ప్రకటనలు కాదు భద్రత కల్పించండి
'మేమంతా మృత్యువు నీడలో బతుకుతుంటాం. మా పశువులకు గాయాలవుతాయి. చనిపోతాయి. మా ఇండ్లు, పశువుల కొట్టాలు దెబ్బతింటాయి. ఇండ్లు వదిలి పారిపోవాల్సిన దుస్థితి పట్టింది మాకు. మా పిల్లల చదువు సాగడం లేదు. ఇదేనా జీవితమంటే?' అని జబోవాల్ గ్రామస్థుడు షంషేర్సింగ్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో కూర్చుని పాకిస్థాన్కు 'మేం గట్టిగా జవాబు చెప్తామని మన మంత్రులు ప్రకటనలు చేసిన ప్రతిసారీ తమమీద మరిన్ని ఎక్కువ దాడులు జరుగుతుంటాయి' అని ఆయన పేర్కొన్నారు. 'వారు చేయాల్సింది ప్రకటనలు కాదు.. మాకు సురక్షిత బంకర్లు నిర్మించడం' అని సింగ్ అన్నారు. నియంత్రణ రేఖ పొడవునా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పాకిస్థాన్ ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిపింది. రెండు రోజుల విరామం తర్వాత 21వ తేదీ నుంచి మళ్లీ కాల్పులు ప్రారంభం అయ్యాయి. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొత్తేమీ కాదు. గత ఆగస్టు నెలలో 285 కాల్పుల ఘటనలు జరిగాయి. ఈ దుర్భర పరిస్థితులు ఇంకెన్నాళ్లు? అని సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.