కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై అట్టుడికిన పార్లమెంట్- ఇరుసభలూ వాయిదా
యూపీలోని లఖీంపూర్ ఖేరీలో దురుసు ప్రవర్తనతో రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేని రాజీనామాపై ఇవాళ పార్లమెంట్ అట్టుడికింది. ఇరు సభల్లోనూ విపక్ష ఎంపీలు అజయ్ మిశ్రా రాజీనామాకు పట్టుబట్టారు. కేంద్రం మాత్రం దీనికి అంగీకరించలేదు. దీంతో విపక్షాలు తీవ్ర నిరసనలకు చేపట్టి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. నిరసనల మధ్యే ఇరుసభలూ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి.
ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే... స్పీకర్ ఓం బిర్లా... గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మరణాన్ని సభకు తెలియజేసి, కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం విజయ్ దివస్ సందర్భంగా బంగ్లాదేశ్ పౌరులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అటు రాజ్యసభలో విజయ్ దివస్ సందర్భంగా జరిగిన సెషన్లో సభాపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలు అయ్యిందిని, అందులో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. విజయ్ దివస్ 50 వ వార్షికోత్సవం సందర్భంగా, దేశాన్ని రక్షించే సాయుధ దళాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ ఏర్పాటు నుంచి భారత్ తో సత్సంబంధాలను కలిగి ఉందని వెంకయ్య తెలిపారు.

అనంతరం లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ లఖీంపూర్ ఖేరీ ఘటనపై సిట్ దర్యాప్తు నివేదికపై చర్చ కోరుతూ విపక్షాలు నిరసనకు దిగాయి. దీంతో ఇరుసభల్లోనూ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ రాజీనామా కోరుతూ విపక్షాలు నిరసనకు దిగాయి. పోడియాల్ని చుట్టుముట్టి నినాదాలు చేశాయి. అయినా కేంద్రం స్పందించకపోవడంతో విపక్షాలు సభల్ని అడ్డుకున్నాయి. చివరకు సభాపతులు ఇరుసభల్ని మధ్యాహ్నం రెండు గంటల వరకూ సభల్ని వాయిదా వేశారు.
వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో లఖీంపూర్ ఖేరీ ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు కారకుడిగా భావిస్తున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆయనపై చర్యలు తీసుకునే సూచనలు కనిపించడం లేదు. దీంతో విపక్షాలు మరో వారం రోజుల పాటు సాగే పార్లమెంటు సమావేశాల్లో ఇదే అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications