క్రీడా రణరంగంగా హస్తిన: ఓ వైపు క్రికెటర్..మరోవైపు బాక్సర్
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. క్రీడా రణరంగంగా హస్తిన మారబోతోంది. ఒకవైపు క్రికెటర్.. మరో వైపు బాక్సర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటమే దీనికి కారణం. ఆ ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో నిల్చున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారిలో ఎవరు లోక్ సభ గడప తొక్కుతారనేది ఆసక్తికరమైన అంశం. వారే- మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బాక్సర్ విజేందర్ సింగ్.
టీమిండియా ఓపెనర్ గా చిరపరిచితుడే..
భారత క్రికెటర్ జట్టు ఓపెనర్ గా గౌతమ్ గంభీర్ దేశ ప్రజలకు చిరపరిచితుడే. 147 వన్డే, 58 టెస్టు, 37 టీ20 మ్యాచ్ లను ఆడిన గౌతమ్ గంభీర్ కు దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు కూడా. రెండేళ్ల కిందటి వరకూ ఐపీఎల్ లోనూ మెరుపులు మెరిపించారు. కోల్ కత నైట్ రైడర్స్ కేప్టెన్ గా వ్యవహరించారు. అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు. భారతీయ జనతాపార్టీలో చేరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
ఒలింపిక్ పతకంతో పతాక స్థాయికి..
పదేళ్ల కిందటి దాకా హర్యానాకు చెందిన విజేందర్ సింగ్ పేరు దేశ ప్రజలకు పెద్దగా తెలియదు. 2008లో బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకాన్ని సాధించి.. అందరి దృష్టినీ ఆకర్షించారు. ఒలింపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో పతకం రావడం మనదేశానికి అదే తొలిసారి. అప్పటి నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు విజేందర్. కామన్వెల్త్ గేమ్స్ సహా ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఇటీవలే ఆయన కూడా రాజకీయ బరిలో దూకారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడి రాజకీయ అరంగేట్రం: ఒకే పార్టీలో తల్లి, కుమారుడు! లోక్ సభ ఎన్నికలకు సినీ గ్లామర్!
ఒకేసారి..ఒకే ప్రాంతం నుంచి
ఒకేసారి, ఒకే ప్రాంతం నుంచి ఇద్దరు వేర్వేరు క్రీడా రంగాలకు చెందిన నిష్ణాతులు ఎన్నికల బరిలో నిల్చోవడం ఆసక్తికరంగా మారింది. ఒకేసారి రాజకీయాల్లో అడుగుపెట్టడం, వేర్వేరు జాతీయ పార్టీల్లో చేరడం, ఆయా పార్టీల అభ్యర్థులుగా ఎన్నికలను ఎదుర్కొంటుండటం పైగా వారు నిల్చున్న లోక్ సభ నియోజకవర్గాలు ఒకే ప్రాంతంలో ఉండటం కాకతాళీయమే. ఈ ఇద్దరిలో విజేతలుగా ఎవరు నిలుస్తారనేది తేలడానికి వచ్చే నెల 23వ తేదీ వరకు ఆగాల్సిందే.