అర్ధరాత్రి బాలిక ఇంట్లోకి టీనేజర్..? దారుణ హత్య.. తండ్రి వాదన వేరే.. సినిమాను తలపించే హైడ్రామా...
ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలోని రెండు గ్రామాల్లో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పదుల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ పరిస్థితి కారణం ఓ అబ్బాయి,ఓ అమ్మాయి కుటుంబాల మధ్య గొడవ. అర్ధరాత్రి తమ ఇంట్లోకి చొరబడ్డాడని ఆ అబ్బాయిని అమ్మాయి కుటుంబం చంపేసింది. ఇందులో కులం కూడా ముడిపడి ఉండటంతో ఇరు కుటుంబాలు,ఇరు గ్రామాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేషన్ల నుంచి అక్కడ పోలీసులను మోహరించారు.
ఉత్తరప్రదేశ్ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ,రాహుల్ దిగ్భ్రాంతి
అసలేం జరిగింది...
ఈ ఘటనలో రెండు వైపుల నుంచి రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలిక కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి 11గం. సమయంలో ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి చొరబడ్డాడు. ఆ సమయంలో వరండాలో నిద్రిస్తున్న బాలిక తాత అలికిడికి నిద్ర లేచాడు. ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు,బంధువులు,చుట్టుపక్కల వాళ్లు అంతా పోగయ్యారు.
అంతా కలిసి దాడి చేయడంతో మృతి...
ఇంట్లోకి చొరబడ్డ ఆ ఇద్దరు అబ్బాయిలను అంతా కలిసి చితకబాదారు. ఇద్దరిలో అమ్మాయిని కలిసేందుకు వచ్చిన అబ్బాయి ఆస్పత్రికి తరలించేసరికే మృతి చెందగా మరొక అబ్బాయి తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎస్ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఈ ఘటనపై మాట్లాడుతూ... ఓ టీనేజ్ అబ్బాయి ఓ అమ్మాయిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లగా అతనిపై దాడి జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. మృతుడి కుటుంబం బాలిక కుటుంబంపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని... ఇప్పటికే నలుగురిని అరెస్ట్ కూడా చేశామని చెప్పారు.అరెస్టయినవారిలో ఇద్దరు బాలిక బంధువులతో పాటు ఇద్దరు చుట్టుపక్కల వ్యక్తులు ఉన్నారు.
మృతుడి తండ్రి ఏమంటున్నారు...
ఇదే ఘటనపై మృతుడి తండ్రి మాట్లాడుతూ... తమ అబ్బాయి,ఆ అమ్మాయి ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని,ఇద్దరివి పక్క పక్క గ్రామాలే అని చెప్పారు. ఇద్దరి మధ్య స్నేహం బహుశా ఆ కుటుంబానికి నచ్చలేదని... అంతమాత్రానికే తన కొడుకుని చంపేడమేంటని ప్రశ్నించారు. 'మా అబ్బాయి వాళ్ల ఇంట్లోకి చొరబడ్డాడో లేదా ఎక్కడైనా పట్టుకుని దాడి చేసి చంపేశారో తెలియదు..' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఆ బాలికే తమ గ్రామస్తులకు సమాచారం అందించిందని... ఆ తర్వాత తమకూ తెలిసిందని చెప్పారు. సోమవారం రాత్రి 9గం. సమయంలో భోజనం తర్వాత తమ అబ్బాయి అతని స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడన్నారు. కొన్ని గంటల తర్వాత తమ కొడుకును ఎవరో చంపేసినట్లు సమాచారం అందిందన్నారు.
అంతా 20నిమిషాల్లో జరిగిపోయింది...
బాలిక బంధువు ఒకరు మాట్లాడుతూ... 'సదరు అబ్బాయి తన స్నేహితుడితో కలిసి బైక్పై ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంటి పక్కనున్న పంట పొలాల వైపు నుంచి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఎవరి అనుమతి లేకుండా లోపలికి వెళ్లడంతో అతనిపై దాడి జరిగింది. అంతా 20-25నిమిషాల్లోనే జరిగిపోయింది. ఘటన సమయంలో బాలిక తండ్రి ఇంట్లో లేడు. ఆమె తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంది. నిజానికి కరోనా లాక్ డౌన్తో స్కూల్ మూతపడ్డప్పటి నుంచి ఆ అబ్బాయి ఆమెను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు.' అని చెప్పుకొచ్చింది.
Recommended Video
కులం...?
మృతి చెందిన బాలుడు(17) ఇటీవలే 12వ తరగతి పరీక్షలు పూర్తి చేశాడని,ఖాళీ సమయంలో కూలీ పనులకు వెళ్తున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తలపై బలమైన గాయాలు కావడంతోనే అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు గుజ్జర్ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా... బాలిక ఠాకూర్ సామాజికవర్గానికి చెందినదని చెప్పారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఠాకూర్ల ఆధిపత్యమే ఎక్కువ కాగా... ఆ బాలుడు ఉండే ఒక్క గ్రామంలో మాత్రమే గుజ్జర్ల ఆధిపత్యం ఉంది. అయితే ఇరువురి మధ్య ఇప్పటికైతే ఎలాంటి గొడవలు జరగలేదు. తాజా ఘటన నేపథ్యంలో ఇరువురి మధ్య అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.