ఎంత కష్టం.. ఎంత కష్టం.. పంజాబ్ టూ యూపీ.. గుండెను మెలిపెట్టే దృశ్యం..
'కూటికోసం, కూలికోసం.. పట్టణంలో బ్రతుకుదామని.. బయలుదేరిన బాటసారికి.. మూడురోజులు ఒక్కతీరుగ నడుస్తున్నా దిక్కు తెలియక..దిగులు పడుతూ, దీనుడౌతూ.. ఎంత కష్టం,ఎంత కష్టం..' 70 ఏళ్ల క్రితం 1950లో తెలుగు కవి శ్రీశ్రీ వలస జీవులను ఉద్దేశించి రాసిన కవిత ఇది. ఇప్పటికీ దాని ప్రాసంగికత కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అప్పటికీ,ఇప్పటికీ వలస జీవుల బతుకుల్లో మార్పేమీ లేదు. కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్తో వేలాది కి.మీ కాలి నడకనే సాగిపోతున్న వలస కార్మికుల వ్యథల గురించి ఎంత వర్ణించినా తక్కువే.
Recommended Video
అసలేం జరిగింది..
తాజాగా వలస జీవుల ధీనస్థితిని,ప్రభుత్వాల వైఫల్యాన్ని కళ్లకు కట్టే మరో వీడియో వెలుగుచూసింది. నిండా పదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి తనవాళ్లతో కలిసి వందల కి.మీ నడవలేక అలసిపోయాడు. దీంతో అతని తల్లి ఆ చిన్నారిని సూట్కేసుపై పడుకోబెట్టి లాక్కెళ్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో కొంతమంది జర్నలిస్టులకు ఈ దృశ్యం కనిపించింది.
పంజాబ్ టూ ఉత్తరప్రదేశ్..
ఆ మహిళను ఆపి ఆరా తీయగా.. చాలాసేపు ఓ చేతిలో బాబును,మరో చేతితో సూట్ కేసును లాగుతూ వచ్చానని.. బాబు అలసిపోవడంతో సూట్ కేసుపై పడుకోబెట్టి తీసుకెళ్తున్నానని చెప్పింది. ఎక్కడో పంజాబ్లోని ఓ ప్రాంతం నుంచి 800కి.మీ దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్కి కాలినడకన వెళ్తున్నట్టు చెప్పింది. అయితే ప్రభుత్వాలు వలస కూలీల తరలింపుకు శ్రామిక్ రైళ్లు,బస్సులు నడుపుతున్నాయి కదా అని ప్రశ్నించగా ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండానే తిరిగి తన బాట పట్టింది.
మార్గమధ్యలోనే రాలిపోతున్న వలస జీవులు..
ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్గా మారింది. ఇది కచ్చితంగా మోదీ సర్కార్ వైఫల్యమేనని పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మార్చి 25న దేశవ్యాప్త లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ వలస జీవులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాలి నడకన వేల కి.మీ ప్రయాణిస్తూ గమ్యం చేరకముందే ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు.ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 17 మంది వలస కూలీలు రైలు చక్రాల కింద నలిగి మృతి చెందిన సంఘటన మరవకముందే.. బుధవారం(మే 13) ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్లలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు మృతి చెందారు.