నివర్ కంటే డేంజర్: వెంటాడుతోన్న మరో తుఫాన్: ఇంకో 48 గంటలే: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
చెన్నై: నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్ వెంటాడబోతోంది. ఇప్పటికే అది బంగాళాఖాతంలో పురుడుపోసుకుంది కూడా. బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర రూపాన్ని దాల్చింది. తీవ్ర అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. క్రమంగా అది వాయుగుండంగా అనంతరం, తుఫాన్ను అవతరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.
Recommended Video
వచ్చే 48 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం.. తుఫాన్గా మారొచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో భారీ వర్షం కురుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
48 గంటల్లో తుఫాన్గా
బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా, అండమాన్కు దక్షిణ దిశగా ఇదివరకు ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడినట్లు వాతావరణ కేంద్రం ప్రాంతీయ అధికారి, తుఫాన్ల హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ ఎన్ పువియరాసన్ తెలిపారు. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఈ తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. వచ్చే 24 గంటల్లో అది వాయుగుండంగా రూపుదాల్చవచ్చని, అనంతరం తుఫాన్గా మారుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 48 గంటల్లోగా తుఫాన్గా ఆవిర్భవించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని అన్నారు.
తమిళనాడు దిశగా..
తుఫాన్గా ాఆవిర్భవించిన అనంతరం అది క్రమంగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నట్లు పువియరాసన్ తెలిపారు. ఫలితంగా తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచే భారీ వర్షాలు పడుతాయని, 48 గంటల పాటు దాని తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు పువియరాసన్ చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సైతం భారీగా తగ్గుతుందని చెప్పారు.
తుఫాన్ల తీవ్రత 30 శాతం
బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహా సముద్రాల్లో తుఫాన్ తరహా పరిస్థితులు ఏర్పడటానికి దారి తీసే వాతావరణం 30 శాతం మేర పెరిగినట్లు పువియ రాసన్ వెల్లడించారు. దశాబ్దకాలం నాటి వాతావరణంతో పోల్చిచూస్తే.. ఇది క్రమంగా మరింత మెరుగుపడుతోందని, భవిష్యత్తులో మరిన్ని తుఫాన్లు ఏర్పడటానికి అనువైన వాతావరణం కనిపిస్తోందని అన్నారు. బంగాళాఖాతం వెంట ఉండి ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా నవంబర్లో 28 నుంచి 29 డిగ్రీల వరకు మాత్రమే ఉంటుందని, ఈ సారి ఆ సంఖ్య పెరిగిందని చెప్పారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రత బంగాళాఖాతం ఉపరితలం మీద నమోదవుతోందని వివరించారు.
నివర్ కంటే ప్రమాదకారిగా...
నివర్ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ దాడికి ఈ రెండూ చివురుటాకుల్లా వణికిపోయాయి. అదే సమయంలో మరో తుఫాన్ దాడి చేయడానికి సిద్ధంగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. నివర్ తుఫాన్ అనంతరం కూడా దాని ప్రభావం కనిపించింది. రాయలసమీ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. ఇప్పుడు కూడా అదే బంగాళాఖాతంలో అదే.. ఆగ్నేయ దిశలో ఏర్పడిన తాజా తీవ్ర అల్పపీడనం.. మరింత తీవ్రరూపం దాల్చుతుందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చిస్తున్నారు. నివర్ కంటే ప్రమాదకారిగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.