కరోనా: ఏసుక్రీస్తులా మోదీ స్వస్థత.. HQC, పారాసిటమాల్ పంపిన హనుమంతుడంటూ బోల్సోనారో భావోద్వేగం..
ఉత్తర అమెరికా ఖండంలో యూఎస్ లాగా.. దక్షిణ అమెరికా ఖండంలోని అతిపద్ద దేశం బ్రెజిల్ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. అమెరికాలో అత్యధికంగా 4లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు, సుమారు 13వేల మరణాలు సంభవించగా, బ్రెజిల్ లో 14వేల కేసులు, 700 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు దేశాలూ ఇప్పుడు ఇండియావైపే ఆశగా చూస్తున్నాయి. కొవిడ్-19 చికిత్సలో బాగా పనిచేస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్(HQC), పారాసిటమాల్ మందుల్ని పంపాలంటూ మోదీని కోరాయి. అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన స్టైల్లో బెదిరింపులకు పాల్పడగా.. బ్రెజిల్ ప్రెసిడెంట్ జెయిర్ బోల్సోనారో మాత్రం భావోద్వేగంతో లేఖ రాశారు.

మానవాళిని కాపాడే మోదీ..
ప్రపంచమంతా కరోనా కాటుకు గురై అల్లాడిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో.. ఆ వ్యాధి నివారణకు వాడే మందుల్ని సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన భారత ప్రధాని మోదీ నిజంగా మహనీయుడని, మానవాళిని కాపాడుతోన్న దేవుడని బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి ఒక లేఖ రాశారు. కరోనాపై పోరులో బ్రెజిల్, భారత్ కలిసి నడుస్తూ, మిగతా దేశాలనూ ఆదుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లేఖలో మోదీని హనుమంతుడు, జీసస్ తో పోల్చడం గమనార్హం.

హనుమంతుడు.. జీసస్..
‘‘ఆనాటి రామాయణంలో.. శ్రీరాముడి సోదరుడైన లక్ష్మణుడు సొమ్మసిల్లి పడిపోయినప్పుడు.. హనుమంతుడు వెంటనే సంజీవని తీసుకొచ్చి కాపాడుతాడు. బైబిల్ లో కూడా ఇలాంటి అద్భుతమొకటుంది. తీవ్రమైన జబ్బుతో బాధపడుతోన్న బర్తలోమయి అనే వ్యక్తిని ఏసుక్రీస్తు స్వస్థపరుస్తారు. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాధితో బాధపడుతోన్న ప్రపంచానికి హైడ్రాక్సీ క్లొరోక్వీన్ మందును అందించి మీరు చేస్తున్నది అదే పని..''అంటూ బ్రెజిల్ ప్రెసిడెంట్ తన లేఖలో రాసుకొచ్చారు. ఒక్క బ్రెజిలే కాదు.. అమెరికా సమా పలు దేశాలన్నీ ఇప్పుడు భారత్ చర్యను, మోదీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాయి.

ఎగుమతులు వేగవంతం..
మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్వీన్, జ్వరానికి వాడే పారాసిటమాల్ మందులు రెండూ కొవిడ్-19 చికిత్సకు కూడా పనిచేస్తున్నాయని వెల్లడైన తర్వాత ఆ మందులకు డిమాండ్ ఏర్పడటం, వాటి ఎగుమతుల్ని భారత్ నిషేధించడం తెలిసిందే. 30కి పైగా దేశాల నుంచి వినతులు రావడంతో భారతప్రభుత్వం.. ఎగుమతుల నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేసింది. దీంతో ఆ రెండు మదుల సరఫరాకు మార్గం సుగగమైంది. ముందుగా దేశీ అవసరాలు తీర్చడానికే నిషేధం విధించామన్న భారత ప్రభుత్వం.. మందును పొరుగుదేశాలకు పంపిన తర్వాతే ఇతర ఖండాల్లోని దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. పొరుగుతున్న శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఇప్పటికే విమానాల ద్వారా మందుల్ని సరఫరా చేశారు. అమెరికా, యూరప్, బ్రెజిల్ కు పంపిన మందులు కూడా ఒకటిరెండురోజుల్లో చేరనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications